Begin typing your search above and press return to search.

ప్రాంతీయ భాషలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   16 Oct 2022 2:26 PM IST
ప్రాంతీయ భాషలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!
X
ప్రాంతీయ భాషలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని కెవడియాలో ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ సమీపంలో అఖిల భారత న్యాయ మంత్రులు, కార్యదర్శుల రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన వీడియో సందేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త చట్టాలను సరళమైన పద్ధతిలో, ప్రాంతీయ భాషల్లో రాయాలని ప్రధాని సూచించారు. పేద ప్రజలు కూడా అర్థం చేసుకునేలా అవి ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థలోనూ ప్రాంతీయ భాషలను వాడాలన్నారు. న్యాయం జరగడంలో ఆలస్యమవుతుండటం అతిపెద్ద సవాల్‌గా మారిందని అభిప్రాయపడ్డారు.

చట్టపరమైన భాష ప్రజలకు అవరోధంగా మారకూడని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. తన ఎనిమిదేళ్ల పాలనలో 1,500పైగా పాత, అనవసర చట్టాలను రద్దు చేశామని గుర్తు చేశారు. వీటిలో చాలా వరకూ బ్రిటిష్‌ పాలన కాలం నుంచి ఉన్నవేనని బాంబుపేల్చారు.

ప్రజా జీవనం సులభంగా మారేందుకు, సులువుగా న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. యువతకు న్యాయ విద్యను మాతృభాషలో అందించాలన్నారు. అలాగే పేదలు కూడా అర్థం చేసుకునేలా చట్టాలను సరళమైన భాషలో రూపొందించాలన్నారు.

సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో ముఖ్యమైన కేసుల డిజిటల్‌ లైబ్రరీలను స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనివల్ల సాధారణ ప్రజల్లో న్యాయ వ్యవస్థపై అవగాహన పెరుగుతుందన్నారు. కోర్టులపై ఒత్తిడి తగ్గించడానికి లోక్‌ అదాలత్‌లు సాయపడుతున్నాయని గుర్తు చేశారు. వీటి ద్వారా పేదలు సత్వర న్యాయం పొందుతున్నారని చెప్పారు.

చట్టాలు కఠినంగా కాకుండా సామాన్యునికి కూడా అర్థమయ్యేలా ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో చట్టాలు చేసినప్పుడు... అందులోని న్యాయపరమైన పారిభాషిక పదాలను అందరికీ వివరిస్తారని గుర్తు చేశారు. స్థానిక భాషలోనూ రాస్తారన్నారు. ఇలా అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. మరికొన్ని దేశాల్లో చట్టాలు చేసేటప్పుడే అవి ఎంతకాలం పాటు అమల్లో ఉండేదీ ముందే నిర్ణయిస్తారన్నారు. మనమూ వీటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. యువతకు న్యాయ విద్యను కూడా స్థానిక భాషల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలి అని కోరారు.