Begin typing your search above and press return to search.

కరోనాపై బ్రహ్మాస్త్రం..ఇక ఏపీలో అందుబాటులోకి..!

By:  Tupaki Desk   |   26 April 2020 12:18 PM IST
కరోనాపై బ్రహ్మాస్త్రం..ఇక ఏపీలో అందుబాటులోకి..!
X
కరోనా సోకి ప్రాణాలు పోయే చివరి దశలో ఉన్న వారిని ‘ఫ్లాస్మా థెరపీ’తో బతికిస్తున్నారు. కరోనాను జయించిన రోగుల రక్తంలోని ప్లాస్మాను తీసుకొని కరోనా తీవ్రంగా ఉన్న రోగులకు చికిత్స చేస్తారు. ఈ చికిత్స ప్రపంచవ్యాప్తంగా మరణానికి దగ్గరైన కరోనా రోగులను బతికిస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలోని జయప్రకాష్ నారాయణ ఆస్పత్రిలో దీన్ని తొలిసారిగా పరీక్షించి సత్ఫలితాలు పొందారు. తెలంగాణలోని గాంధీతోపాటు పలు దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో ఈ ప్లాస్మా థెరపీకి అనుమతిచ్చారు. ఎయిమ్స్ సంస్థ ఈ వైద్య విధానాన్ని దేశంలోని అన్ని ఎయిమ్స్ లోనూ ప్రవేశపెట్టడానికి రెడీ అయ్యింది.

కరోనాతో చావుబతుకుల మధ్య వెంటిలేటర్ పైనున్న రోగులకు ఈ చికిత్స చేస్తారు. తాజాగా ఈ ప్లాస్మా థెరపీని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేయడానికి కేంద్రం ఓకే చెప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఢిల్లీ జేపీ నారాయణ ఆసుపత్రిలో నలుగురు రోగులకు ప్లాస్మా థెరపీ చేయగా వారు కోలుకున్నారు. దీంతో దశల వారీగా దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో దీన్ని అమలు చేస్తున్నారు.

ఇక ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ లో అమలు చేసేందుకు రెండు బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్ బృందం పర్యటన తర్వాత ఏపీలో ఈ థెరపీని అమలు చేయనున్నారు.