Begin typing your search above and press return to search.

శబరిమలకు ప్లాన్ చేస్తున్నారా? ఇది చదవటం మిస్ కావొద్దు

By:  Tupaki Desk   |   16 Dec 2020 9:02 AM IST
శబరిమలకు ప్లాన్ చేస్తున్నారా? ఇది చదవటం మిస్ కావొద్దు
X
కరోనా కాకుండా.. మామూలుగా అయితే.. ఈ సమయానికి వీధులన్ని అయ్యప్ప మాల వేసుకున్న వారితో కళకళలాడిపోతుండేవి. వీధుల్లో అయ్యప్ప భజనలతో హడావుడిగా ఉండేది. పాడు కరోనా కారణంగా ఇప్పుడు సీన్ మొత్తం రివర్సు అయ్యింది. అయినప్పటికి.. అయ్యప్పను అమితంగా ఆరాధించే వారు మాల వేసుకోవటం మానలేదు. నారు పోసినోడు నీరు పోయక మానరన్న చందంగా.. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా శబరిమలకు వెళ్లేందుకు ఎవరికి వారుగా ప్లాన్ చేస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఇదంతా నాణెనికి ఒక పార్శమైతే.. మరోవైపు కేరళలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులతో కేరళ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

దేశంలో కరోనా వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకున్న రాష్ట్రంగా మొదటి వేవ్ వేళ వచ్చిన మంచిపేరు మొత్తం సెకండ్ వేవ్ పుణ్యమా అని గాలికి కొట్టుకుపోయింది. ఈ రోజున దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యే రాష్ట్రాల్లో కేరళ టాప్ త్రీలో ఒకటిగా ఉందన్నది మర్చిపోకూడదు. ఇలాంటివేళ.. శబరిమలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాల్ని రూపొందించింది. డిసెంబరు 26 తర్వాత అయ్యప్ప దర్శనానికి వచ్చే వారందరికి కొత్త రూల్ పెట్టేసింది.

ఈ నెల 26న మండల పూజ తర్వాత అయ్యప్ప క్షేత్రం వద్ద విధులు నిర్వహించే సిబ్బంది.. దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా పరీక్షల్ని తప్పనిసరి చేసింది. గత నెల రోజుల్లో ఆలయం వద్దకు వచ్చిన వారిలో.. పని చేసిన సిబ్బందిలో 299 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లుగా పేర్కొంది. దీంతో.. శబరిమలకు వచ్చే భక్తులు నీళక్కల్ బేస్ క్యాంప్ నకు చేరుకోవటానికి 24 గంటల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగిటివ్ సర్టిఫికేట్ చూపించిన తర్వాతే.. అనుమతిస్తారు. జనవరిలో జరిగే ప్రత్యేక పూజల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకు తరలివచ్చే వీలున్న నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని.. భౌతికదూరంపాటించని వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. సో.. శబరిమలకు వెళ్లే వారికి ఎదురయ్యే కొత్త రూల్ గురించి ముందే హెచ్చరిస్తే మంచిదన్నది మర్చిపోవద్దు.