Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ బ్రేకింగ్‌ - రఫేల్ మంత్రి ఆడియో టేపు సారాంశ‌మిదే

By:  Tupaki Desk   |   3 Jan 2019 4:16 AM GMT
కాంగ్రెస్ బ్రేకింగ్‌ - రఫేల్ మంత్రి ఆడియో టేపు సారాంశ‌మిదే
X
మాటల మాంత్రికుడు మోదీని మౌనమునిలా మార్చేసింది రఫేల్ కుంభకోణం.. సుప్రీం కోర్టు కాస్త ఉపశమనం కలిగించిన తరువాతే దీనిపై ఆయన, బీజేపీ నోరు పెగిలింది. అయితే.. తాజాగా మరోసారి బీజేపీ, మోదీలకు ఈ విషయంలో షాకిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకే చెందిన నేత ఒకరి సంభాషణల ఆడియోను మీడియాకు రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారును డిఫెన్సులోకి నెట్టింది.

ఇదీ ఆ ఆడియో టేపు పూర్తి పాఠం..

గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె, విలేకరిగా భావిస్తున్న మరో వ్యక్తి మధ్య సంభాషణలుగా చెబుతున్న ఈ ఆడియో టేపు ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రక్షణ శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారికర్ ఇటీవల తన మంత్రివర్గ సమావేశంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ సంభాషణలున్నాయి. మనోహర్ పారికర్ తన పడగ్గదిలోనే రఫేల్ డీల్ పత్రాలన్నీ ఉన్నాయని కేబినెట్ భేటీలోనే చెప్పారని విశ్వజిత్ రాణె ఆ వ్యక్తితో చెబుతున్న ఆడియో ఇది.

విలేకరిగా భావిస్తున్న వ్యక్తి: గుడ్ ఈవ్‌నింగ్ సర్.

విశ్వజీత్ రాణె: గుడ్ ఈవ్‌నింగ్ బాస్. ఈ రోజు కేబినెట్ భేటీ 3 గంటలపాటు సాగింది. ఆ విషయం చెబుదామనే ఫోన్ చేశాను. ఈ విషయాన్నిసీక్రెట్‌ గా ఉంచండి.

విలేకరిగా భావిస్తున్న వ్యక్తి: అలాగే అలాగే..

విశ్వజిత్ రాణె: మీటింగులో చాలా గొడవలు జరిగాయి. నీలేష్ కబ్రాల్ తన నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది ఇంజినీర్లను రిక్రూట్ చేశారు. జయేశ్ సల్గోవాంకర్ ఆ జాబితాను సంపాదించి, ఆయనకు చూపించారు. అందరూ ఆయనతో గొడవ పడ్డారు. నియామకాల విషయంలో వ్యవహారాలు సక్రమంగా లేవని అంతా ఆందోళన వ్యక్తం చేశారు. తన పనులేవీ జరగడం లేదంటూ సుదిన్ ధవాలికర్‌తో బాపూ అజ్‌గోవాంకర్ గొడవపడ్డారు.

దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే... రఫేల్‌ కు సంబంధించిన సమాచారం అంతా తన బెడ్‌ రూమ్‌ లో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

విలేకరిగా భావిస్తున్న వ్యక్తి: ఏమిటీ.. ఏమంటున్నారు మీరు?

విశ్వజిత్ రాణె: నా నోటితో నేను చెబుతన్నా కదా... దీనిపై నువ్వొక స్టోరీ చేయొచ్చు. కావాలంటే మంత్రుల్లో నీకు క్లోజ్‌ గా ఉన్నవారితో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు కూడా.రఫేల్‌ డీల్‌ కు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్ తనవద్దే ఉందని. అవన్నీ తన ఇంట్లో.. తన పడగ్గదిలోనే ఉన్నాయని కూడా చెప్పారు. మరి, ఆయనెందుకు ఇలా చెప్పారో తెలీదు. తాను చెప్పిన మాట ఎవరైనా దిల్లీకి చేరవేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. ఈ సంగతి చెప్పాలనే నీకు ఫోన్ చేశాను.

విలేకరిగా భావిస్తున్న వ్యక్తి: మరి.. స్పీకర్ సడెన్‌ గా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ఎందుకు అనుకున్నారు.

విశ్వజిత్: ఆయన సీఎం కావాలనుకుంటున్నారు. దానికి ఆరెస్సెస్ మద్దతు కోసం ట్రై చేస్తున్నారు. ఆ... మనం ఒకసారి కలవాలి. నువ్వు కొన్ని సంగతులు దిల్లీకి మోసుకెళ్లాలి.

విలేకరిగా భావిస్తున్న వ్యక్తి: ఓకే.. మీరెప్పుడంటే అప్పుడే.

కాగా ఈ సంభాషణలు బయటకు రాగానే.. పారికర్ ట్విటర్ వేదికగా ఖండించారు. మంత్రివర్గ సమావేశంలో కానీ, ఇంకెక్కడా కానీ ఇలాంటి సంభాషణేమీ జరగలేదని ట్వీట్ చేశారు. ఇక ఈ సంభాషణల్లో ఉన్నట్లుగా చెబుతున్న విశ్వజిత్ రాణె కూడా అది తన గొంతు కాదని ఖండించారు.