Begin typing your search above and press return to search.

అమెరికా ఫ్రాడ్: ఏజెంట్ల‌లో ఒక‌రు విడుద‌ల‌

By:  Tupaki Desk   |   5 Feb 2019 6:22 AM GMT
అమెరికా ఫ్రాడ్: ఏజెంట్ల‌లో ఒక‌రు విడుద‌ల‌
X
పే టు స్టే స్కాంలో కీల‌క ప‌రిణామం చోటుచేస‌కుంది. ఫ‌ర్మింగ్ ట‌న్ ఫేక్ వ‌ర్సిటీ కేసులో అమెరికా పోలీసులు 8 మంది ద‌ళారీల‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే అందులో క‌ర్నాతి ఫ‌ణిదీప్‌ అనే వ్య‌క్తి త‌ర‌పున డెట్రాయిట్ కోర్టులో డిఫెన్స్ అటార్నీ జాన్ బ్రూస్‌ స్టార్ వాదించారు. వీసా ఫ్రాడ్ కేసులో అమెరికా అక్ర‌మ ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపించారు. కెంట‌కీకి చెందిన ఫ‌ణిదీప్‌ ను హోమ్‌ ల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలు దుస్తుల్లో కోర్టుకు ఫ‌ణిదీప్‌ హాజ‌ర‌య్యారు. వంద‌లాది మంది విద్యార్థుల‌కు ఫ‌ణిదీప్‌ ఫేక్ వీసాలు ఇప్పించార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. దీనిపై వాదించిన అటార్నీ బ్రూస్‌ స్టార్‌.. ప్ర‌భుత్వ వైఖ‌రిని ఖండించారు.

విద్యార్థుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌భుత్వ‌మే ఇలాంటి ట్రాప్‌ ను వేయ‌డం అసంబ‌ద్ధ‌మైంద‌ని అటార్నీ బ్రూస్‌ స్టార్ అన్నారు. కోర్టురూమ్‌ లో వాద‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో.. ఫ‌ణిదీప్‌ భార్య‌ - పిల్ల‌లు కూడా అక్క‌డే ఉన్నారు. ఫ‌ణిదీప్‌ ఫ్యామిలీ ఈ దేశాన్ని ప్రేమిస్తుంద‌ని, కానీ మీరు ట్రీట్ చేసిన తీరు బాగాలేద‌ని అటార్నీ అన్నారు. ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను - స్టింగ్ ఆప‌రేష‌న్‌ ను ఆయ‌న త‌ప్పుపట్టారు. కావాల‌నే ప్ర‌భుత్వం వ‌ల వేసి అక్ర‌మంగా విద్యార్థుల‌ను అరెస్టు చేసింద‌ని బ్రూస్ స్టార్ అన్నారు. అయితే ప‌దివేల డాల‌ర్ల బాండ్‌ పై ఫ‌ణిదీప్‌ ను రిలీజ్ చేశారు. ప‌దేళ్ల క్రితం హెచ్‌1బీ వీసా కింద ఫ‌ణిదీప్‌ అమెరికాకు వెళ్లాడు. లూయిస్‌ విల్లేలో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ఇంజినీర్‌ గా చేస్తున్నాడు. మొత్తం 8 మందిలో ఒక్క ఫ‌ణిదీప్‌ మాత్రమే ఈ కేసులో బాండ్‌ పై రిలీజ్ అయ్యాడు.

ఇదిలాఉండ‌గా - సామా సంతోష్‌ రెడ్డి - త‌క్క‌ల‌ప‌ల్లి అవినాశ్‌ - ప్ర‌త్తిపాటి న‌వీన్‌ - నూనె అశ్వంత్‌ ల పిటిష‌న్లను పెండింగ్‌ లో పెట్టారు. అయితే 8 మంది ద‌ళారీలు త‌మ‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల ప‌ట్ల స్పందించ‌కుండా.. కోర్టులో మౌనంగా ఉండిపోయారు. మెజిస్ట్రేట్ జ‌డ్జి ఆర్‌.స్టీవెన్ వాలెన్ ఈ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన మ‌రో 129 మంది భార‌తీయులు డిటెన్ష‌న్ సెంట‌ర్‌ లో ఉన్నారు. వారిని ఒక‌ట్రెండు రోజుల్లో విచార‌ణ చేసి విడుద‌ల చేయ‌నున్నారని స‌మాచారం.