Begin typing your search above and press return to search.

అన‌ర్హ‌త కోసం.. రాజ్యాంగాన్ని స‌వ‌రించండి... వైసీపీ ఎంపీల విన‌తి.. ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   13 Aug 2021 1:30 AM GMT
అన‌ర్హ‌త కోసం.. రాజ్యాంగాన్ని స‌వ‌రించండి... వైసీపీ ఎంపీల విన‌తి.. ఏం జ‌రుగుతుంది?
X
ఏపీ అధికార పార్టీ వైసీపీకి కంట్లో న‌లుసుగా, పంటి కింద రాయిగా మారిన సొంత ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు విష‌యంలో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పార్టీకి, పార్టీ అధినేత జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా మారి పోయి.. నిత్యం విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు కూడా పాల్ప‌డుతున్నార‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీ ల‌తో ఆయ‌న మిలాఖ‌త్ అయి.. అధికార పార్టీ, సొంత ప్ర‌భుత్వంపై ఆయ‌న కుట్రలు ప‌న్నుతున్నార ని.. పేర్కొంటూ.. ర‌ఘురామపై అనర్హ‌త వేటు వేయాలని.. ఇప్ప‌టికే పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు విన్న‌వించారు. అయితే.. ఇలా ఫిర్యాదు చేసి.. ఏడాది దాటిపోయినా.. స్పీక‌ర్ ఓం బిర్లా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చర్య‌లు తీసుకోలేదు.

పైగా.. ఎంపీ ర‌ఘురామ‌కు.. కేంద్రం పెద్ద‌లు అప్పాయింట్‌మెంటు ఇస్తున్నారు. ఒకే వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ర‌ఘురామ రెండు సార్లు భేటీ కావ‌డం.. వైసీపీకి స‌హ‌జంగానే ఆగ్ర‌హం తెప్పి స్తోంది. అదేస‌మ‌యంలో తాజాగా ముగిసిన పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో అయినా.. ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేసేలా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని.. అనుకున్నా.. అది కూడా జ‌ర‌గ‌లేదు. మ‌రోవైపు ఇప్ప‌టికే అధికార పార్టీ నేత‌ల‌పై దూకుడుగా ఉన్న ర‌ఘురామ‌.. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు కోరుతూ.. పిటిష‌న్ వేశారు.

ఈ ప‌రిణామాలు.. వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ‌ని.. ముఖ్యంగా ఎంపీల‌ను మ‌రింత ఇబ్బంది పెడు తున్నాయ‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ఎత్తుగ‌డ వేశారు.. వైసీపీ కీల‌క నేత‌.. ఎంపీ సాయిరెడ్డి. అస‌లు రాజ్యాంగంలోని షెడ్యూల్‌ ప‌ది మేర‌కు.. అస‌లు ఒక స‌భ్యుడిపై అన‌ర్హ‌త వేటు వేసేందుకు నిర్ణీత స‌మ‌యంలో లేనందున‌.. ఇప్ప‌టికైనా.. ఈ ఆర్టిక‌ల్‌ను స‌వ‌రించి.. నిర్ణీత గ‌డువు.. విధించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీలు.. సాయిరెడ్డి, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ, వేమి ప్ర‌భాక‌ర్‌రెడ్డి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజుజుకు విన‌తి ప‌త్రం ఇచ్చారు.

దీని ప్ర‌కారం.. షెడ్యూల్‌ 10లో అనర్హత పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్టమైన గడువును స్పష్టంగా పేర్కొనకపోవడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లక్ష్యం నెరవేరడం లేద‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. చట్టంలోని లొసుగును ఫిరాయింపుదారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఎంపీలు చెబుతున్నారు. జేడీ(యూ) సభ్యుడు శరద్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకుని రాజ్యసభ ఛైర్మన్ వెంక‌య్య నాయుడు... సత్సంప్రదాయాన్ని నెలకొల్పారని, దీనిని ప్రమాణంగా తీసుకుని లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ, మండళ్లలో అమలుకు వీలుగా పదో షెడ్యూల్‌ను సవరించాల‌ని వారు కోరుతున్నారు.

వైసీపీ ఎంపీల విష‌యాన్ని కొద్దిసేపు ప‌క్క‌న పెడితే.. వాస్త‌వానికి అటు లోక్ స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ స‌భ్యులకు సంబంధించి అన‌ర్హ‌త‌పై కేంద్రం త‌న‌కు అనుకూలంగా ఉన్న‌పార్టీల‌కు ఒక‌ర‌కంగా.. త‌న‌ను ఇబ్బంది పెట్టే పార్టీల విష‌యంలో మ‌రో ర‌కంగా.. వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ ఎంపీ విష‌యంలోనూ కేంద్రం ద్వంద్వ ప్ర‌మాణాలు పాటిస్తోంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌పై ఫిర్యాదు చేసి ఏడాది దాటినా.. ఇప్ప‌టికీ చ‌ర్య‌లు తీసుకోలేద‌ని.. కానీ.. శ‌ర‌ద్ యాద‌వ్ వంటి..(బిహార్‌లో బీజేపీకి ప్ర‌త్య‌ర్థి)వారి విష‌యంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించింద‌నే కామెంట్లు ఉన్నాయి.