Begin typing your search above and press return to search.

లోకేష్‌ తో మాట్లాడుకునే విమర్శలు: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   2 Feb 2023 9:00 PM GMT
లోకేష్‌ తో మాట్లాడుకునే విమర్శలు: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!
X
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. తన ఫోనును ట్యాపింగ్‌ చేశారని కోటంరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా నెల్లూరు రూరల్‌ వైసీపీ ఇంచార్జిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని వైసీపీ అధిష్టానం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డిని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా బందరు ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. నారా లోకేష్‌ తో ఫోనులో మాట్లాడుకుని పార్టీపై విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డే వారిద్దరి మధ్య ఫోన్‌ కాల్‌ రికార్డ్‌ చేశారని తెలిపారు. తమ మధ్య జరిగిన సంభాషణను వారే రికార్డింగ్‌ చేసుకుని ట్యాపింగ్‌ అంటున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు. కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి వచ్చి అన్నీ చెబుతారన్నారు.

గతేడాది డిసెంబరు 25న చంద్రబాబుతో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మాట్లాడినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారని అన్నారు. లోకేష్‌ తోనూ కోటంరెడ్డి ఫోన్‌లో మాట్లాడారని ఆరోపించారు. కోటంరెడ్డిని సీఎం నమ్మితే ఆయనకు నమ్మక ద్రోహం చేశారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోటంరెడ్డిది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని పేర్ని నాని తెలిపారు. అది ఫోన్‌ రికార్డింగ్‌ అని, వీడియోతో పాటు టెక్ట్స్‌ మెసేజు కూడా ఉందన్నారు. కోటంరెడ్డి వాట్సాప్‌ కాల్‌ డేటా అంతా మీడియా ముందు పెట్టాలని పేర్ని నాని సవాల్‌ విసిరారు.

ఎమ్మెల్యేలపై నిఘా ఎందుకు ఉంటుంది? అని పేర్ని నాని ప్రశ్నించారు. డిసెంబర్‌ 25న చంద్రబాబును కోటంరెడ్డి కలిశారని ఆరోపించారు. అంతకు ముందు నుంచే లోకేష్‌ తో కూడా టచ్‌లో ఉన్నారన్నారను. ఒక చోట పనిచేస్తూ.. పక్క చూపులు చూడటం సరికాదని కోటంరెడ్డికి పేర్ని నాని హితవు పలికారు.

కాగా వైసీపీ నేతల్లో అసంతృప్తి, విభేదాల దృష్ట్యా సీఎం జగన్‌ పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. నేతల మధ్య విభేదాలు, పరిష్కారం, తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశానికి 26 జిల్లాల పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఫోన్‌ కాల్‌ను ఆయన స్నేహితుడే రికార్డింగ్‌ చేశారని స్పష్టం చేశారు. కోటంరెడ్డిపై చర్యలకు సంబంధించి త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్టు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నిరూపించాలని సవాల్‌ విసిరారు. రెండేళ్లుగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగితే ఇప్పుడే ఎందుకు చెప్పారని నిలదీశారు. పార్టీని వీడాలని నిర్ణయించుకుని వెళ్లే ముందు ఏదో ఒక విమర్శలు చేసి పోతున్నారని మండిపడ్డారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.