Begin typing your search above and press return to search.

ఎన్నికల సిత్రాలు.. ఇన్నిన్ని కాదయా.?

By:  Tupaki Desk   |   28 Nov 2018 5:00 AM GMT
ఎన్నికల సిత్రాలు.. ఇన్నిన్ని కాదయా.?
X
తెలంగాణ ఎన్నికలకు వేళయ్యింది. డిసెంబర్ 7న ఓటరు నాడి ఈవీఎంలలో నిక్షిప్తమవ్వబోతోంది. ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడుతారనే విషయాన్ని పక్కనపెడితే.. తెలంగాణ ఎన్నికలు మాత్రం బహు ఖరీదుగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగే 7వ తేదీ మధ్య దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉండడంతో అభ్యర్థుల చేతిచమురు వదులుతోంది. కార్యకర్తలు - నాయకులను మేప లేక అభ్యర్థులు సతమతమవుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు లేట్ గా ప్రకటించి కాసిన్ని డబ్బులు మిగుల్చుకోగా.. టీఆర్ ఎస్ మాత్రం అసెంబ్లీ రద్దు చేయగానే 105మందిని ప్రకటించేశారు. ఆ అభ్యర్థులకు ఖర్చు తడిసిమోపడవుతోంది.

ఎన్నికలు ఎమ్మెల్యే అభ్యర్థులకు తలకుమించిన భారం అవుతుండగా.. కార్యకర్తలు - కింది స్థాయి నాయకులు - రోజువారీ కూలీలు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. రోజుకు కనీసం 500 రూపాయలు - దాంతో పాటు మధ్యాహ్నం బిర్యానీ - రాత్రి క్వార్టర్ మందు డిమాండ్ చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో కూలీకి రోజుకు రూ.700 వరకు అభ్యర్థులు ఖర్చు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ కూడా పోటీ ఉంది. ఈరోజు కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేసిన వారు తెల్లవారే సరికి గులాబీ కండువా ధరించి టీఆర్ ఎస్ తరుఫున ప్రచారం చేస్తున్నారు. నాయకులు పార్టీలు మారినట్టు కూలీలు కూడా ఎవ్వరు ఎక్కువిస్తే వారి తరుఫున కండువాలు మార్చేసి పార్టీ జెండాలు పట్టుకొని జై కొడుతున్నారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో కూలీలు షిఫ్ట్ లు వేసుకొని మరీ ప్రచారం చేస్తూ సంపాదించుకుంటున్నారు. ఉదయం కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న వారు.. సాయంత్రం గులాబీ కండువాతో ప్రచారం చేస్తున్నారు. ఆ తెల్లవారి బీజేపీ నేతతో కలిసి తిరుగుతున్నారు.

తెలంగాణ ఎన్నికల వేళ ఇప్పుడు కొందరు సరఫరా చేసే గ్రూపులుగా ఏర్పడి అభ్యర్థులను పీల్చి పిప్పిచేస్తున్నారు. ప్రతి దానికి రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఎన్నికల వేళ నాయకుల వెంట తిరిగే వారిని - బూతు కమిటీల ఏర్పాటుకు - గల్లీ ప్రచారానికి వెళ్లడానికి ప్రతి వాళ్లకు రేట్ ఫిక్స్ చేసి అభ్యర్థులకు సరఫరా చేసేలా కొందరూ ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. ఇందుకు వేలకు వేలు వసూలు చేస్తున్నారు. గడిచిన 2014 ఎన్నికలతో పోలిస్తే నాయకులు - జనాలు - కూలీలు కూడా బాగా తెలివిమీరిపోయారు. ఊరికే సభలు - సమావేశాలకు ఎవ్వరూ రావడం లేదు.. ప్రచారంలో పాల్గొనడం లేదు. ప్రతి మనిషికి రూ.500 నుంచి రూ.1000 దాకా ఖర్చు చేసే అభ్యర్థి వెంట నేతలు - కూలీలు తిరుగుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది.

తెలంగాణ ఎన్నికల వేళ యువత కూడా పండుగ చేసుకుంటోంది. వారికి బైక్ ఉంటే చాలు ర్యాలీలకు నాయకులు డబ్బులిచ్చి తీసుకెళుతున్నారు. బైక్ కు ఇంత.. పెట్రోల్ కు ఇంత చొప్పున రూ.1000 వరకు యువకులకు ముట్టజెప్పి ప్రచారానికి తీసుకెళుతున్నారు. బైక్ ర్యాలీల్లో యువకులు పాల్గొంటూ సంపాదించేస్తున్నారు. ఈరోజు టీఆర్ ఎస్ స్టిక్కర్ ను బైక్ కు వేసుకొని తిరుగుతున్న యువకులు రేపు దానిపైన అది చింపకుండానే కాంగ్రెస్ స్టిక్కర్లు అంటించి వారి వెంట ర్యాలీగా వెళుతున్నారు. సంపాదనే ధ్యేయంగా యువత కూడా ప్రచారంలో అందినకాడికి నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. ముఖ్యంగా గాలికి తిరిగే.. ఖాళీగా ఉండే యువతకు తెలంగాణ ఎన్నికలు మంచి ఆదాయవనరుగా మారాయి. పరిస్థితి ఎలా ఉందంటే.. నిరుద్యోగ యువతకు ఈ రాబోయే 10 రోజులు ఒక బైక్ ఉంటే చాలు.. వారి పంట పండినట్టే కనిపిస్తోంది.

అభ్యర్థులేం తక్కువ తినలేదు.. ఇప్పుడు ప్రచారం కోసం పిలిచిన కూలీలు - నేతలు - యువకులను గెలిచాక పట్టించుకుంటారన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు రాసుకుపూసుకు తిరిగిన నేత గెలిచాక దగ్గరకు రానిస్తే అదే పదివేలు. ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న ఈ చిత్రాల్లో మొత్తం ఎవరి స్వార్థానికి వాళ్లు పనిచేసుకుంటున్నారని అర్థమవుతోంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడితో అటు అభ్యర్థులు - ఇటు సామాన్యులు ప్రచారంలో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.