Begin typing your search above and press return to search.

బాబు చేతుల్లో ప్ర‌జాస్వామ్యం హ‌తం : ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   27 Nov 2017 1:45 PM GMT
బాబు చేతుల్లో ప్ర‌జాస్వామ్యం హ‌తం : ఐవీ రెడ్డి
X
సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గా...త‌నను తాను విలువ‌ల ప‌రిర‌క్ష‌కుడిగా ప్ర‌క‌టించుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు..చెప్పేది ఒక‌టి..చేసేది ఇంకొక‌ట‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్ద‌లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ ఐవీ రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ మరో ఎమ్మెల్యేను చేర్చుకున్న నేపథ్యంలో ఐవీ రెడ్డి సోమవారం విడుద‌ల చేసిన ఒక‌ పత్రికా ప్రకటనలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌ను తీవ్ర‌స్థాయిలో త‌ప్ప‌ప‌ట్టారు.

చంద్ర‌బాబు నోరు తెరిస్తే...విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేస్తాన‌ని అంటున్నార‌ని దాని అర్థం ఎమ్మెల్యేల‌కు విలువ క‌ట్ట‌డ‌మా అని ఐవీ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. `ఒక్కో ఎమ్మెల్యేకు వెల‌క‌ట్టి పాతిక కోట్లు...30 కోట్లు అని బేరం పెట్టి కొనుగోలు చేయ‌డ‌మే మీ విలువ‌ల రాజ‌కీయం అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం? చంద్రబాబు లాంటి చీప్ పొలిటీషియన్ చేతిలో భారత ప్రజాస్వామ్యం హతం అవుతోంది. అనునిత్యం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యంగ స్ఫూర్తికి తూట్లు పొడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయానికి పాల్పడుతున్నారు..కొనుగోలు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఆయనకు దమ్మూ ధైర్యం ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి` అని ఐవీ రెడ్డి స‌వాల్ విసిరారు.

ఈ సంద‌ర్భంగా ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు...అటు అధికార పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై ఐవీ రెడ్డి మండిప‌డ్డారు. చంద్రబాబువి గుంట నక్క రాజకీయాలని ఐవీ రెడ్డి ఆరోపించారు. `వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్న తీరు చూసి ప్ర‌జ‌లు సిగ్గుప‌డుతున్నారు. ఇలాంటి హీనులనా మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది అని వీరికి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఫిరాయింపుదారులు, వీళ్ల ట్రూపుకు పెద్ద చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మోసం చేయవచ్చు. ఇదంతా తాత్కాలికమే. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోలేని చేతగాని రాజ్యాంగ వ్యవస్థ ఉండవచ్చు. కానీ.. ఈ మోసం కలకాలం సాగదని గుర్తుంచుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మేం స‌వాల్ చేస్తున్నాం...పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాల‌ని ఇటు ఎమ్మెల్యేల‌కు అటు చంద్ర‌బాబుకు స‌వాల్ విసురుతున్నాం. ఎన్నిక‌ల‌కు సిద్ధ‌ప‌డాలని కోరుతున్నాం...కానీ లాంటి దమ్మూ, ధైర్యం, సిగ్గూ శరం అటు.. చంద్రబాబు నాయుడికీ లేవు.. ఇటు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలకూ లేవు. ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్న ఈ పాపానికంతటికీ చంద్రబాబు తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది`` అని ఐవీ రెడ్డి హెచ్చ‌రించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలందరికీ అభివృద్ధికి అవ‌కాశాలు క‌ల్పించార‌ని ఐవీరెడ్డి గుర్తు చేశారు. అప్పటికీ ఇప్పటికీ తేడా.. నక్కకూ నాకలోకానికి ఉన్నం తేడా ఉందని అన్నారు. వైసీపీని ఎదుర్కోలేక చేరిక‌ల రూపంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నట్టుగా ఉన్నార‌ని ఐవీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతోనే అది జరుగుతుందని బాబు అనుకుంటున్నట్టుగా ఉన్నాడని..అయితే అది కేవలం పగటి కల మాత్రమే అని ఆయన గుర్తుంచుకోవాలని ఐవీరెడ్డి సూచించారు. సార్వత్రిక ఎన్నికల రూపంలో ప్రజాతీర్పును ఎదుర్కొనడానికి మరెంతో దూరం లేదని ఐవీరెడ్డి హెచ్చ‌రించారు.