Begin typing your search above and press return to search.

కడసారి చూపునకు నోచుకోని కరోనా మృతులు!

By:  Tupaki Desk   |   2 July 2020 5:30 PM GMT
కడసారి చూపునకు నోచుకోని కరోనా మృతులు!
X
మహమ్మారి వైరస్ పేరు చెబితేనే...జనం హడలెత్తి పోతున్నారు. ఏ క్షణాన ఎవరికి తగులుకుంటుందోనని భయపడి చస్తున్నారు. ఇక, పొరపాటునో గ్రహపాటునో కరోనా సోకితే....ఆ కుటుంబం మానసికంగా కుంగిపోతోంది. దానికి తోడు....కరోనా సోకిన రోగి కుటుంబాన్ని చాలామంది ప్రజలు ఓ రకమైన వివక్షతో చూస్తున్నారు. కరోనాతో అందరం యుద్ధం చేస్తున్నామని....వైరస్ తో పోరాటం చేయాలి కానీ, రోగితో, రోగి కుటుంబంతో కాదని ప్రచారం ఊదరగొడుతున్నా...మెజారిటీ జనం మాత్రం మారడం లేదు. ఇక, కరోనా సోకి మరణించిన వారి అంత్యక్రియల విషయంలో చాలామంది ప్రజలు మానవత్వం అనేది ఒకటుంటుందని కూడ మరచిపోతున్నారు. చనిపోయింది తమకు సుపరిచితుడైనా...ఇరుగుపొరుగువాడైనా.. కనికరించడం లేదు. తమ ప్రాంతంలోని శ్మశాన వాటికలో మాత్రం కరోనా రోగుల అంత్యక్రియలు మాత్రం చేయడానికి వీల్లేదని నానా రచ్చ చేస్తున్నారు.

కరోనా రోగుల మృతదేహాల వల్ల వైరస్ సోకే అవకాశం లేదని...తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆ మృతదేహాలను ఖననం లేదా దహనం చేయాలని ఐసీఎంఆర్ కూడా చెబుతోంది. అయినప్పటికీ...చాలామంది ప్రజలు ఈ అంత్యక్రియల వ్యవహారంలో పాషాణ హృదయాలతో వ్యవహరించడం శోచనీయం. మానవత్వం లేని కరోనాకు కనికరం లేదు...అయితే, కరోనా సోకిన వారి విషయంలో మానవత్వం ఉన్న మనుషులు కూడా దానవుల్లా మారిపోతున్నారనడానికి అనేక ఘటనలు నిలువెత్తు నిదర్శనాలు. కరోనా సోకిన వారు ఏదో పాపం, నేరం, ఘోరం చేసినట్లు...సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డట్లు చూస్తున్నారు కొందరు జనం. ఈ వివక్ష కారణంగానే కరోనా వైరస్‌ సోకి చనిపోయినవారి మృతదేహాలు అందరూ ఉండి కూడా అనాథ శవాలుగా మిగులుతున్నాయి. పుట్టిన ఊరిలోని మట్టిలోనే గిడదామని అనుకున్న వారి కడసారి కోరిక...కోరికగానే మిగిలిపోతోంది.

అందరూ ఉండి కూడా.... బంధువులు, అయిన వారి చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగే అవకాశమున్నా కూడా....అనాథగా చెన్నైలో నెల్లూరుకు చెందిన ఓ వైద్యుడి అంత్యక్రియలు జరిగిన ఘటక చాలామందిని కలచివేసింది. చెన్నైలోనూ ఒక శ్మశాన వాటికలో అంత్యక్రియలకు అంగీకరించకపోవడంతో....వేరే చోటికి తరలించి పోలీసుల బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కడపలో కవల పిల్లలకు జన్మనిచ్చి చనిపోయిన ఓ మహిళ అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలో జరిపేందుకు గ్రామస్థులు నిరాకరించారు. దీంతో, కడప శివార్లలో ఆమె అంత్యక్రియలు అనాథలా జరిపారు కుటుంబ సభ్యులు. కరోనా సోకి చనిపోయిన తండ్రి అంత్యక్రియలకు బిడ్డలు హాజరు కాలేని పరిస్థితులు...కన్నతల్లిని కడసారి చూసేందుకు కొడుకులు నోచుకోని దుస్థితులను కల్పిస్తున్నారు కొందరు ప్రజలు. ఇక, కొన్ని చోట్ల గ్రామాల్లో అంత్యక్రియలకు అనుమతించినా....పాడె పట్టేందుకు గ్రామస్థులు, బంధువులు ముందుకు రాని పరిస్థితి. ఇటువంటి ఘటనలకు అవగాహన లోపం, అపోహలు కారణం. కరోనా రోగులతో పాటు కరోనా సోకి చనిపోయిన వారి అంత్యక్రియల్లోనూ వివక్ష చూపకూడదన్న ప్రచారం ప్రభుత్వం మరింత విస్తృతంగా చేయాల్సిన అవసరముంది.

కరోనాతో లేదా కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయిన వారి అంత్యక్రియలను వారివారి గ్రామాల శ్మశాన వాటికలో జరపాలని,వాటిని అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా....కొంతమంది ప్రజలు పట్టించుకోవడం లేదు. కరోనా సోకి చనిపోయిన వ్యక్తి కుటుంబం కుంగిపోయి ఉంటుందని.....వారికి అండగా ఉండకపోయినా పర్వాలేదని...కానీ, ఇలా అంత్యక్రియలకు అడ్డుపడి వారికి మరింత మనోవేదన కలిగించకూడదని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించాలని, ఆ రోగికి సంబంధించి ఏవైనా అపోహలు, అనుమానాలు ఉంటే పోలీసులు - రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, అంతేకానీ, ఇష్టానుసారం మృతదేహాలను అడ్డుకుంటామంటే కుదరదని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరిస్తున్నారు. శ్మశాన వాటికల్లోకి రాకుండా ఆయా కుటుంబ సభ్యులను అడ్డు కోవాలనిచూస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.