Begin typing your search above and press return to search.

మట్టి దిబ్బలో బంగారు నాణేలు.. ఎగబడ్డ జనం

By:  Tupaki Desk   |   12 Oct 2020 8:00 AM IST
మట్టి దిబ్బలో బంగారు నాణేలు.. ఎగబడ్డ జనం
X
అసలే బంగారం.. ఇప్పుడు కరోనా టైంలో ఏకంగా 10 గ్రాములకు 50వేలు దాటింది.దీంతో చిన్న ముక్క బంగారమైనా ఇప్పుడు నిజంగా బంగారమే. అందుకే మట్టిదిబ్బలో బంగారు నాణేలు అనగానే జనాలు ఎగబడ్డారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దుల్లో బంగారు నాణేదలు కలకలం సృష్టించాయి.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో మట్టిదిబ్బల కింద బంగారు నాణాలు బయటపడడం సంచలనంగా మారింది. ఈ బంగారు నాణాల కోసం జనం తొలిరోజూ భారీగా తరలిరాగా.. రెండో రోజు కూడా ఎగబడుతున్నారు.

బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో స్థానికులు.. చుట్టుపక్కల జనాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఏపీ సరిహద్దు గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో వెళ్తున్నారు.

ఇప్పుడు అక్కడ నాణేల కోసం తోపులాటలు, ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక్కో నాణేం రెండు గ్రాములకు పైగా బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాటిపై అరబిక్ భాషలో లిపి ఉన్నట్టు గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న హోసూరు పోలీసులు.. అందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి దిబ్బల్లోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రెండోరోజూ కూడా హోసూరు -బాగలూర్ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.