Begin typing your search above and press return to search.

దేశంలో పెండింగ్ లో ఉన్న కేసులు ఎలాంటివో బయటకు వచ్చింది

By:  Tupaki Desk   |   1 May 2022 2:30 PM GMT
దేశంలో పెండింగ్ లో ఉన్న కేసులు ఎలాంటివో బయటకు వచ్చింది
X
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యమైన దేశంగా పేరున్న మన దేశంలో.. ప్రజాస్వామ్యానికి నాలుగు స్థంభాల్లో ముఖ్యమైనది న్యాయవ్యవస్థ. ఇదెంత చురుకుగా వ్యవహరిస్తుంటే.. సామాన్యుడికి న్యాయం అంత సత్వరంగా లభిస్తుంది. అయితే.. ప్రభుత్వాన్ని ఎన్ని మాటలు చెప్పినా.. న్యాయవ్యవస్థ తమ పని తాము చేసుకునేందుకు వీలుగా.. ఆ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. బ్యాడ్ లక్ ఏమంటే.. నిత్యం వేలాది కోట్ల రూపాయిలు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసే ప్రభుత్వాలు.. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయటానికి.. వాటి మౌలిక వసతులు మెరుగుపర్చటానికి వీలుగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మన దేశంలోని కోర్టులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య భారీగా పోగుపడిన పెండింగ్ కేసులు. దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులు ఏకంగా 4.11 కోట్లు. వీటిని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఆ లోపు మరిన్ని కేసులు నమోదు కావటం.. వాటి విచారణ వాయిదా పడిపోవటంతో కేసులు కొండల మాదిరి పేరుకు పోతున్నాయి. ఇలాంటి వేళ.. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించటానికి వీలుగా దేశ రాజధాని ఢిల్లీలో సదస్సు ఏర్పాటు చేయటం తెలిసిందే.

దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ షాకింగ్ నిజాల్ని వెల్లడించారు. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా దేశంలో న్యాయ వ్యవస్థ పలు సమస్యల్ని ఎదుర్కొంటుదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు సరిగా పని చేస్తే న్యాయస్థానాలకు పని ఉండదని.. కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోయే అవకాశం ఉండదన్నారు.

దేశంలో పెండింగ్ లో ఉన్న కేసుల్లో 66 శాతం ఎలాంటివో చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. ''ఒక తహశీల్దార్‌ భూసర్వే విషయం కానీ, రేషన్‌కార్డు విషయం కానీ, రైతు సమస్యను కానీ పట్టించుకున్నా, మున్సిపల్‌ అధికారులు.. గ్రామ పంచాయతీలు తమ విధులు సరిగా నిర్వహించినా, రెవెన్యూ అధికారులు చట్టప్రకారం భూమిని సేకరించినా.. ప్రజలు కోర్టు తలుపు తట్టే అవకాశమే లేదు'' అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ''ప్రభుత్వంలో వివిధ విభాగాల మధ్య తగాదాలు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య వివాదాలు కూడా కోర్టులకు ఎందుకు ఎక్కుతున్నాయో అర్థం కావడం లేదు. సీనియారిటీ, పింఛను తదితర అంశాల్లో సర్వీసు చట్టాలను సరిగ్గా అమలు చేస్తే ఏ ఉద్యోగి కోర్టులకు వెళ్లడు కదా? 50శాతం పెండింగ్‌ కేసులు ఇవే ఉన్నాయి. పోలీసు దర్యాప్తులు సవ్యంగా సాగితే, అక్రమ అరెస్టులు, కస్టడీలో హింసలు అంతమైతే ఏ బాధితుడూ కోర్టును ఆశ్రయించడు'' అని వ్యాఖ్యానించారు.

కోర్టు కేసుల్లో పెండింగ్ కేవలం న్యాయ వ్యవస్థే కారణం కాదన్న సీజేఐ.. 'ప్రభుత్వాలే అతి పెద్ద ప్రతివాదులు. ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉన్న 50 శాతం కేసుల్లో ప్రభుత్వాలే అతి పెద్ద లిటిగెంట్లుగా ఉన్నాయి. ఈ విషయాన్ని అంగీకరించాలి. కోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు.. పరిష్కరించాల్సిన కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యలు దుర్వినియోగం అవుతున్నాయి. అవి కాస్తా వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారుతున్నాయి'' అంటూ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టేశారని చెప్పాలి. వ్యవస్థను బాగు చేయటం కోసం ప్రభుత్వాలు చేపట్టాల్ని మార్పుల్ని సీజేఐ తన మాటలతో ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పారని చెప్పక తప్పదు.