Begin typing your search above and press return to search.

చంద్రబాబుకే చమటలు పట్టిస్తున్నాడే?

By:  Tupaki Desk   |   12 Nov 2019 10:19 AM GMT
చంద్రబాబుకే చమటలు పట్టిస్తున్నాడే?
X
వాళ్లిద్దరూ ఆగర్భ శత్రువులు.. ఒకరు కాంగ్రెస్ లో ఉంటే మరొకరు వారి వ్యతిరేకపార్టీలో ఉండేవారు.. విశేషం ఏంటంటే వాళ్లద్దరూ క్లాస్ మేట్స్.. చిత్తూరు ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించారు. ఆ తర్వాత రాజకీయాల్లోనూ ప్రత్యర్థులుగా చెలామణి అవుతున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఒకరంటే ఒకరికి పడదు.. రాజకీయంగా బద్ధ శత్రువులు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి..వీరిద్దరూ చిత్తూరు జిల్లా రాజకీయాలను ఏలినవారే..

చిత్తూరు జిల్లాపై ఆధిపత్యం కోసం ఎన్నోసార్లు చంద్రబాబు, పెద్దిరెడ్డిల మధ్య వార్ నడిచింది. అయితే చంద్రబాబు చాలా సార్లు సీఎంగా అధికారంలో ఉండడంతో పెద్దిరెడ్డి పై ఆధిపత్యం చెలాయించారు. ఆయనను అణగదొక్కారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది... జగన్ కేబినెట్ లో పెద్దిరెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తించడం.. మొన్నటి ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో ఒక్క కుప్పం సీటు తప్ప అన్నింట్లోనూ వైసీపీ అభ్యర్థులను పెద్దిరెడ్డి గెలిపించి చంద్రబాబును చావుదెబ్బ కొట్టారు. చంద్రబాబు మెజార్టీని కుప్పంలో తగ్గించి భయపెట్టారు.

పెద్దిరెడ్డి అధికారంలో ఉండడం.. మంత్రిగా ఉండడంతో ఇప్పుడు చిత్తూరులో తన రాజకీయ శత్రువైన చంద్రబాబు పార్టీని నామరూపాల్లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్న ప్రచారం సాగుతోంది.. ఆ భయంతోనే చంద్రబాబు ఏకంగా మూడు రోజుల పాటు ఇటీవల చిత్తూరు జిల్లాలో పార్టీ సమీక్ష పెట్టి నేతలకు భరోసా కల్పించి ధైర్యం చెప్పారు.

అయితే తాజాగా టీడీపీ ఉపాధ్యక్షురాలు , మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభను వైసీపీలో చేర్చేందుకు పెద్దిరెడ్డి స్కెచ్ గీశారు. ఇటీవల ఆమె ఇంట్లో శ్రీపురం స్వర్ణ దేవాలయం పీఠాధిపతి పూజల కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి పెద్దిరెడ్డి వెళ్లి పాల్గొనడం టీడీపీ అధినేతను షాక్ కు గురిచేసింది. ఆమె వైసీపీ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

మొన్నటి ఎన్నికల వేళ సత్యప్రభ సీటును మార్చి చంద్రబాబు రాజంపేట ఎంపీగా ఆమెను పోటీచేయించారు. ఆమె ఓడిపోయాక పార్టీ వైపు చూడడం లేదు. టీడీపీకి, చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి వైసీపీ బ్యాచ్ ఆమెకు దగ్గరవ్వడం టీడీపీకి షాక్ లా పరిణమించింది.

చిత్తూరులోని 14 నియోజకవర్గాల్లో 13 గెలిచిన వైసీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబును కుప్పంలో కూడా ఓడించాలని పట్టుదలతో ఉందట.. ఈ మేరకు పెద్ది రెడ్డి టీడీపీ కేడర్ ను సమూలంగా చిత్తూరు జిల్లాలో వైసీపీలోకి మార్చి చంద్రబాబును చావుదెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అధికారంలో ఉండడంతో చంద్రబాబుకు చమటలు పట్టిస్తున్నారట పెద్దిరెడ్డి. ఇన్నేళ్లుగా చంద్రబాబు తనపై చేసిన ప్రతీకారానికి ఇప్పుడు వడ్డీతో సహా ఇచ్చేందుకు పెద్దిరెడ్డి రెడీ కావడం.. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయనకు శరాఘాతంగా మారిందంటున్నారు.