Begin typing your search above and press return to search.

ఆ విషయంలో పవన్‌ది రాంగ్‌ స్టెప్పేనా?

By:  Tupaki Desk   |   26 Nov 2022 3:30 PM GMT
ఆ విషయంలో పవన్‌ది రాంగ్‌ స్టెప్పేనా?
X
ఇప్పటంలో తమకు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారంటూ 14 మంది ఇప్పటం గ్రామస్తులు హైకోర్టులో వేసిన పిటిషన్‌ బూమరాంగ్‌ అయిన సంగతి తెలిసిందే. అధికారులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదంటూ కోర్టును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారంటూ 14 మందికి హైకోర్టు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాంగ్‌ స్టెప్‌ వేశారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జనసేన ఆవిర్భావ సభకు వైసీపీ ప్రభుత్వం ఎక్కడా స్థలం దొరకకుండా.. ఇవ్వనీయకుండా చేసిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటం గ్రామస్తులు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు తమ భూమలు ఇచ్చారు.

దీంతో వారిపై కక్ష కట్టిన ప్రభుత్వం నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేసిందని జనసేన, టీడీపీ, తదితర పార్టీలు ఆరోపించాయి. అయితే రోడ్డు విస్తరణ కోసం తాము ముందుగానే నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.

హైకోర్టు తాజాగా 14 మంది గ్రామస్తులకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది. మరోవైపు ప్రభుత్వ కూల్చివేతలతో నష్టపోయిన ఇప్పటం గ్రామస్తులకు లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తానని గతంలోనే పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్‌ 27న పవన్‌ కల్యాణ్‌ మరోసారి ఇప్పటంలో పర్యటించనున్నారు. బాధితులకు లక్ష చొప్పున సాయం చేయనున్నారు.

అయితే ఈ వ్యవహారంలో అధికార వైసీపీ పవన్‌ కల్యాణ్‌ను తప్పబడుతోంది. వైసీపీ మంత్రులు చంద్రబాబు మాయాలో పవన్‌ కల్యాణ్‌ పడిపోయారని.. తద్వారా రాంగ్‌ స్టెప్‌ వేశారని చెబుతున్నారు. చంద్రబాబు.. పవన్‌ను కూడా కూరలో కరివేపాకులాగా చేస్తాడని.. ఆ తర్వాత వదిలేస్తాడని ఇప్పటికైనా బాబు మాయలో పడొద్దని కోరుతున్నారు.

మరోవైపు ఇప్పటం గ్రామస్తులు, జనసేన పార్టీలో కొంతమంది నేతలు ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి పవన్‌ కల్యాణ్‌ను తప్పుదోవ పట్టించారని అంటున్నారు. వారి మాట నమ్మిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పటంలో పర్యటించి రాంగ్‌ స్టెప్‌ వేశారని చెబుతున్నారు.

కూల్చివేతకు ముందు ఇప్పటం గ్రామ నివాసితులకు ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని, అయితే స్థానికులు ఉద్దేశపూర్వకంగా నోటీసులను దాచిపెట్టారని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే.

హైకోర్టు 14 మంది గ్రామస్తులకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించినప్పటికీ పవన్‌ కల్యాణ్‌ వెనక్కి తగ్గడం లేదు. తాను ముందే హామీ ఇచ్చినట్టు భాదితులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు, ఈ మేరకు నవంబర్‌ 27న ఆయన ఇప్పటంలో పర్యటించనున్నారు.

మరోవైపు ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ఆనందంలో మునిగితేలుతోంది, ఈ నేపథ్యంలో పవన్‌ తదుపరి స్టెప్‌ ఎలా ఉంటుందో, ఆయన వ్యూహం ఏమిటో చూడాలి అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.