Begin typing your search above and press return to search.

కిడ్నీ దినోత్స‌వానికి ఏం చేయాలో చెప్తున్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   8 March 2017 5:42 PM GMT
కిడ్నీ దినోత్స‌వానికి ఏం చేయాలో చెప్తున్న ప‌వ‌న్‌
X
ప్ర‌తి ఏటా మార్చి రెండో వారంలో ప్రపంచ కిడ్నీ నివారణ దినోత్సవం పేరుతో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌దైన మార్క్ స్పంద‌న ఇచ్చారు. మార్చి నెల‌లోని రెండో గురువారం 9వ తేదీన వ‌స్తున్నందున ప‌వ‌న్ క‌ళ్యాణ్ కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై స్పందించారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఉన్న ఉద్దానం కిడ్నీ బాధితులు - క‌నిగిరి వాసుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది ఆయ‌న ప్ర‌క‌ట‌న‌.

"మార్చ్ 9 ప్రపంచ కిడ్నీ నివారణ దినోత్సవం . మార్చ్ నెలలో రెండో గురువారం నాడు ఏటా కిడ్నీ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం.21 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. పాటించి మనం ఏమి సాధించాం?? శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రజల ప్రాణాలను హరిస్తూ వారిని పీల్చి పిప్పి చేస్తోంది. ఏడు మండలాలు.120 గ్రామాల్లో 50 వేలమంది ప్రజలు ఈ వ్యాధితో మంచాన పడ్డారు. వేలాది మంది విగత జీవులయ్యారు. ప్రకాశం జిల్లా కనిగిరి లో కూడా ఇదే పరిస్తితి. తమకు వచ్చిన రోగానికి కారణం ఏమిటో తెలియని అమాయకపు జనం ఒక పక్క, కారణం తెలిసినా చేష్టలుడిగిన ప్రజా ప్రతినిధులు మరో పక్క! ఇలా 2000 సంవత్సరం నుంచి ఉద్యాన వనం అయిన ఉద్దానం మోడువారిపోతోంది. 20 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిపైనే ఈ మహమ్మారి కన్నేస్తోంది. రెక్కాడితేనేగాని డొక్కాడని పేదలను నెల నెల 8000 రూపాయలను వైద్యం కోసం ఖర్చుపెట్టిస్తోంది. ఇన్నాళ్లకు సర్కారు స్పందించింది. నష్ట నివారణకు కదిలింది. అయితే ఈ మహమ్మారిని ఉద్దానం నుంచి కూకటి వేళ్ళతో పెకిలించాలంటే....సాదాసీదా చర్యలు సరిపోవు. యుద్ధ ప్రాతిపదికన వ్యాధిపై దాడి చేయాలి. దీని కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలి. అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఉద్దానానికి ఉపశమనం కలుగుతుంది. వచ్చే కిడ్నీ దినోత్సవం నాటికైనా ఉద్దానం ఆరోగ్యంగా కళకళలాడాలని మనమంతా భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. జైహింద్."

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/