Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వాల‌కు కాదు..ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తా:ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   30 July 2017 12:09 PM GMT
ప్ర‌భుత్వాల‌కు కాదు..ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తా:ప‌వ‌న్‌
X
ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. దీనికోసం అవసరమైతే ప్రతిపక్షాల మద్దతు కూడా కోరతానని ఆయన చెప్పారు.  తాను కూడా అక్కడి ప్రజల్లో ఒకడినేనని, వారి సమస్య పరిష్కారం కోసమే అంతమందిమి కలిసి వచ్చామని ఆయన అన్నారు. విశాఖప‌ట్ట‌ణంలో మెడిక‌ల్ సింపోజియంలో ఆయ‌న మాట్లాడారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యను రాజకీయ కోణంలో చూడటం లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఉద్ధానంలో కిడ్నీ సమస్యలకు చాలా కారణాలు చెప్పారని, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

ఉద్దానం కిడ్నీ సమస్యలకు కారణాలు కనుగొని పరిష్కరిస్తే బాగుంటుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. గ‌త ప్ర‌భుత్వాలు చేయ‌ని ప‌నిని ఈ ప్ర‌భుత్వం అయినా చేయాల‌ని  కోరారు. తాను ప్రభుత్వాలకు కాదు ప్రజలకు సేవ చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. మన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెత‌క‌కుండా రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. సమస్యను స్పష్టంగా వేలెత్తి చూపుతున్నప్పుడు దానిని పరిష్కరించకుండా విమర్శలు చేసుకుంటుండడం హాస్యాస్పదమని చెప్పాడు. ఉద్దానం ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇలాంటి సమస్యల పరిష్కారంలో తాను నిపుణుడ్ని కాదని ప‌వ‌న్ అంగీక‌రించారు. అయితే మనిషిగా, తోటి మనిషి కష్టంలో భాగం పంచుకోవాలని చూసే వ్యక్తినని అన్నాడు. ఎంతో మంది నిపుణులు, మేధావులు, పరిశోధకులు కలిసి ఈ సమస్యను పరిష్కరించలేరా? అని ప్రశ్నించాడు. ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదని అన్నాడు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయితే ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందని భావించి ఈ విషయంలో స్పందించానని అన్నారు.

ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, హార్వర్డ్‌ యూనివర్సిటీ డాక్టర్లు, నిపుణులు హాజరయ్యారు. ఉద్దానంలో అధ్యయనం చేసిన వివరాలను పవన్‌కు డాక్టర్లు వివరించారు.  హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన‌ డాక్టర్‌ జోసెఫ్ ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ బాధితుల శాంపిల్స్‌ ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషించాలని, బయో మార్కర్స్‌తో వ్యాధి తీవ్రతను గుర్తించి...సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కిడ్నీ వ్యాధులు సోకడానికి అనేక కారణాలున్నాయని వైద్యులు చెప్పారు. జనసేన ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న మెడికల్‌ సింపోజియమ్‌లో పాల్గొన్న వైద్యులు కిడ్నీ వ్యాధులు సోకడానికి తక్కువగా మంచినీరు తాగే అలవాటు ఉండటం ఒక ప్రధాన కారణమన్నారు. అలాగే జన్యుపరమైన సమస్యలు, పౌష్టికాహార లోపం, సిలికా మినరల్స్‌ కలిగిన నీటిని తాగడం మొదలైన కారణాల వల్ల కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు తెలిపారు. డాక్టర్‌ రవి రాజు మాట్లాడుతూ ఉద్దానంతో పాటు శ్రీలంక, సెంట్రల్‌ అమెరికా, యూరప్‌ దేశాల్లో కూడా కిడ్నీ వ్యాధి ఉందని అన్నారు. కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయని, వ్యాధి మూలాలు అంతుబట్టడం లేదని డాక్టర్‌ రవిరాజు పేర్కొన్నారు. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, బాధితులకు అవసరమైన వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ కిడ్నీ సమస్యపై అధ్యయనానికి ప్రపంచ స్థాయి రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఉద్దానం సమస్యపై ఎప్పటికప్పుడు డేటా సేకరించి ప్రపంచ పరిశోధకుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందని, ప్రపచంలోనే అతికొద్ది ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. ఉద్దానంలో అయితే సమస్య తీవ్రంగా ఉందని డాక్టర్‌ సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా అంత‌క‌ముందు జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ విశాఖ విమానాశ్రయంనుంచి అభిమానుల ర్యాలీతో కలిసి పోతన మల్లయ్య పాలెం చేరుకున్నారు. హార్వర్డ్‌ వైద్యుల బృందంతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సమావేశమయ్యారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి మార్గాలను పవన్‌ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అన‌త‌రం ఆయ‌న సింపోజియంలో ప్ర‌సంగించారు. రేపు హార్వర్డ్‌ వైద్యులతో కలిసి సీఎం చంద్రబాబునాయుడును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలవనున్నారు. హార్వర్డ్‌ వర్సిటీ వైద్యుల సూచనలను పవన్‌ సీఎం చంద్రబాబుకు నివేదించనున్నారు.