Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కు ఫోన్ చేసిన పవన్ కల్యాణ్?

By:  Tupaki Desk   |   15 Sept 2019 10:36 AM IST
టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కు ఫోన్ చేసిన పవన్ కల్యాణ్?
X
అత్యంత ప్రమాదకరమైన యురేనియంను వెలికి తీసే పనిలో భాగంగా నల్లమలలో ఇందుకు సంబంధించిన ప్లాంట్ కట్టే ప్రయత్నాలు ప్రారంభం కావటం తెలిసిందే. దీనిపై సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకూ.. వివిధ వర్గాలకు చెందిన సెలబ్రిటీలు సైతం సేవ్ నల్లమల ఉద్యమంలో భాగస్వామి అవుతున్నారు.

అన్నింటికి మించి ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. కుర్రాడైన కేసీఆర్ మనమడు హిమాన్షు సైతం సేవ్ నల్లమలలో భాగస్వామి కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. యురేనియం తవ్వాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా ఒప్పుకుందన్న ప్రశ్నను పలువురు ఎత్తి చూపిస్తున్నారు. యురేనియం తవ్వకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను పర్సనల్ గా మాట్లాడతానని మంత్రి కేటీఆర్ చెప్పటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. యూరేనియం వెలికితీతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

తెలంగాణలో నల్లమల అడవిని తవ్వి యురేనియం తీయాలన్న కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పు పట్టిన ఆయన.. ఈ నెల 16న తాను ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి హాజరు కావాలని కోరారు. పవన్ ఆహ్వానానికి రేవంత్ ఓకే చెప్పేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సైతం పవన్ ను కలిసి.. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరటం.. అందుకు పవన్ ఓకే చెప్పటం తెలిసిందే.

యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున మొదలైన సేవ్ నల్లమలపై మంత్రి కేటీఆర్ పాజిటివ్ గా రియాక్ట్ కావటం.. సీఎంతో వ్యక్తిగతంగా మాట్లాడి ఇష్యూను కొలిక్కి తెస్తానని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అవుతూ.. కేటీఆర్ తన సురభి నాటకాల్ని ఆపాలంటూ పంచ్ వేశారు.

ఇలాంటివేళలో రేవంత్ కు ఫోన్ చేసి మరీ తాను చేపట్టిన అఖిలపక్ష సదస్సుకు రావాలని పవన్ కోరిన తీరు చూస్తే.. ఈ అంశంపై సూటిగా మాట్లాడటంతోపాటు.. పలు విషయాల్ని సమర్థవంతంగా తెర మీదకు రావటంలో రేవంత్ టాలెంట్ తెలిసే ఆయన్ను పవన్ స్వయంగా ఆహ్వానించారని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో పలు రోటీన్ రౌండ్ టేబుల్ సమావేశాలకు భిన్నంగా ఈ సదస్సు హాట్ హాట్ గా సాగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.