Begin typing your search above and press return to search.

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ఇదే..

By:  Tupaki Desk   |   23 Dec 2018 9:55 AM IST
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ఇదే..
X
పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన నాలుగున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఈ మేరకు శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జనసేన పార్టీకంటూ ఓ గుర్తు లభించింది. ఈ గుర్తుపైన జనసేన పార్టీ అభ్యర్థులు ఏపీ, తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయనున్నారు.. ఇంతకీ జనసేన పార్టీకి కేటాయించిన గుర్తు ఏమిటో తెలుసా.. ‘గాజు గుర్తు’. గల్లీ టీ కొట్లలో మనం తాగే చాయ్ గ్లాస్ ను పోలి ఉంది.

జనసేనతో పాటు దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేనకు సామాన్యులకు తెలిసిన ‘గాజు గ్లాస్’ను కేటాయించడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

ఇన్నాళ్లు గుర్తులేకుండా పోటీచేయడానికి జనసేన కొంత ఇబ్బంది పడింది. పవన్ కూడా వివిధ కారణాల వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే సాధారణ, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరుఫున అభ్యర్థులందరూ ‘గాజు గ్లాస్’ పైనే పోటీ చేస్తారు. జనసేనకు ‘గాజు గ్లాస్’ కేటాయించినట్టు తెలియగానే పవన్ అభిమానులు - జనసైనికులు ట్విట్టర్ - ఫేస్ బుక్ లలో ఈ ఎన్నికల గుర్తును షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం గాజు గ్లాసు గుర్తు ట్రెండ్ అవుతోంది.

ఎన్నికల గుర్తు రావడంతో ఇన్నాళ్లు జనసేన చక్రం గుర్తు తో సాగిన పవన్ యాత్రల్లో ఇక నుంచి గాజు గ్లాసును కూడా కలిపి పోస్టర్లు, వాహనాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ గాజు గ్లాస్ ను జనసేన ఎన్నికల గుర్తుగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా అమరావతిలో జనవరి1న పార్టీ నాయకులతో సమావేశమవుతున్నారు.