Begin typing your search above and press return to search.

రాజోలులో రాపాకకు షాక్‌

By:  Tupaki Desk   |   16 March 2020 11:44 AM GMT
రాజోలులో రాపాకకు షాక్‌
X
జనసేన జెండాతో గెలిచి వైసీపీతో అంటకాగుతున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కు అధిష్టానం గట్టి షాకిచ్చింది. ఎంపీటీసీ - జెడ్పీటీసీ టిక్కెట్ల విషయంలో రాపాకను పూర్తిగా పక్కన పెట్టేసింది. రాపాకతో సంబంధం లేకుండానే లోకల్‌ లీడర్లకు ఆ పార్టీ బీ ఫారాలిచ్చింది. రాపాక వరప్రసాద్‌... జనసేన ఏకైక ఎమ్మెల్యే. రాజోలు నుంచి గెలిచారు. గుడ్డిలో మెల్లగా ఒక్క సీటన్నా వచ్చిందన్న సంబంరం జనసేనకు మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. ఎన్నికలయ్యాక అతి కొద్దికాలంలోనే రాపాక వైసీపీ పంచన చేరారు. అధికారికంగా అధికార పార్టీ తీర్ధం పుచ్చుకోకపోయినా... జగన్‌ కే జై కొడుతున్నారు. సమయం కోసం ఎదురుచూస్తున్న జనసేనాని.. లోకల్‌ బాడీ ఎలక్షన్లను సమయానుకూలంగా వాడుకున్నారు. బీ ఫారాల విషయంలో రాపాకను పక్కనబెట్టి గట్టి మొట్టికాయ వేశారు. ఇది నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

రాజోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో రాపాక కీలక పాత్ర పోషించారు. మాల కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ పెదపాటి అమ్మాజీ - ఎన్నికల్లో ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావుతో కలిసి అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. వారికే బీ ఫారాలు ఇచ్చారు. రాజోలు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించే జనసేన లీడర్‌ గురుదత్త ప్రసాద్‌... జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. అధికారికంగా ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేగానే ఉన్న రాపాకను... ఈ కార్యక్రమానికి మాట వరసకు కూడా పిలవలేదు. దీంతో, రాపాక వరప్రసాద్‌ ను జనసేనాని పూర్తిగా పక్కకు పెట్టేసినట్లేనని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. లోకల్‌ లీడర్ల సొంత బలంతోనే జనసేన మళ్లీ ఎన్నికల్లోకి దూకబోతోంది.