Begin typing your search above and press return to search.

వినాయకచవితి ఉద్యమంలోకి పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   8 Sep 2021 4:28 AM GMT
వినాయకచవితి ఉద్యమంలోకి పవన్ కళ్యాణ్
X
వినాయకచవితి వేడుకలపై ఇన్నాళ్లు బీజేపీ మాత్రమే పోరుబాట పట్టింది. ఆ తర్వాత దీనిపై టీడీపీ అందుకుంది.. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఉద్యమంలోకి వచ్చారు. ఏపీలో వినాయకచవితి వేడుకలపై నిషేధాన్ని నిరసిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు నిషేధం విధించారో నాకు నిజంగా అర్ధం కాలేదని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతి సంప్రదాయాలు, ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితి పండగకు కోవిడ్ నిబంధల వల్ల అనుమతులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం నమ్మశక్యంగా లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక చవితి పండగకు మాత్రమే వర్తిస్తాయా? వైసీపీ ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పుట్టిన రోజులకు, పండగలకు, పబ్బాలకు వర్తించవా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామంటే మాత్రం కోవిడ్ నిబంధనలు గుర్తొస్తాయా? కోవిడ్ నిబంధనలు దేనికి వర్తిస్తాయి? దేనికి వర్తించవు అనేది మన రాష్ట్రంలో ప్రభుత్వమే డిసైడ్ చేస్తోందని పవన్ అన్నారు.

పక్క రాష్ట్రాలు వినాయక చవితి పూజలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం పండగను చేసుకోవద్దని చెప్పడం, గణపతి విగ్రహాలను అమ్మే వ్యక్తులను అరెస్టు చేయడం, విగ్రహాలు తీసుకుపోవడం చూస్తుంటే పాలకులు దేని మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ నిలదీశారు. మన భారతదేశంలో ఏ పని మొదలుపెట్టినా ముందుకు నమస్కరించేంది గణపతికేనని పవన్ అన్నారు. విఘ్నాధిపతికి నమస్కారం చేసుకొనే ఏ పనైనా మొదలుపెడతామని.. అలాంటి గణపతి పండగను జరుపుకోవద్దు అంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేసినా, రథాలను కాల్చేసినా, శ్రీరాముడి విగ్రహానికి తలతీసేస్తే ఈ రోజు వరకు దోషులను పట్టుకోలేదన్నారు. వారిని పట్టుకోకపోగా, ఈ రోజు కొత్తగా వినాయక చవితి జరుపుకోవద్దు అని నిబంధనలుపెట్టడం దేనిని సూచిస్తున్నాయని ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వానికి సలహాలు చెప్పేది ఎవరు? దేనిమీద దాడి చేస్తున్నాయో అర్ధమవుతుందా? ఒక్కసారి వైసీపీ పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలని జనసేనాని పవన్ అన్నారు. ‘‘వైసీపీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నామని.. మీరు వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. పక్క రాష్ట్రాలు ఎలాంటి పరిమితులతో అనుమతులు ఇచ్చాయో మీరు కూడా అదే పరిమితులతో ఇక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వాలి. ఇది విశ్వాసానికి సంబంధించినది కాబట్టి అలా ఇస్తేనే మంచిది. జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది ఇంతకుమించి గొడవ చేయకుండా పర్మిషన్లు ఇవ్వాలి. ఇచ్చి తీరాలి. వేరే దారి లేదు.’’ అని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం అంటూ సమీక్షలో కలిపారు తప్ప ఇంకేం లేదని పవన్ విమర్శించారు. జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితిని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దెబ్బ తిన్న రహదారులు. ఆ సమస్య గురించే మాట్లాడాలని పవన్ నిలదీశారు. ‘సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం’ అనే చందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉందని విమర్శించారు. ఈ మాట ఎందుకంటున్నానంటే పోర్టులు, ఎయిర్ పోర్టులు మెజార్టీ శాతం ప్రైవేటుపరం అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు ప్రతి పెద్ద పోర్టు కూడా ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే ఉంది. అక్కడ బెర్తులు నిర్మించాలన్న, అభివృద్ధి చేయాలన్నా వాళ్లు చూసుకుంటారు. వాటి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రమే. ఎయిర్ పోర్టులను కూడా దాదాపు ఎయిర్ పోర్టు అధారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తాయి. లేదా ప్రైవేటు సంస్థలు నడుపుతాయి. అక్కడ రన్ వేలు వాళ్లు చూసుకుంటారు. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టుల్లో రన్ వేలు వేయదు. పోర్టుల్లో బెర్తులు నిర్మించదు. ఆ రెంటింటిని సంబంధింత కేంద్ర ప్రభుత్వ సంస్థలు చూసుకుంటాయని పవన్ అన్నారు.

రోడ్ల దుస్థితిపై చేస్తున్న సమీక్షలో వీటిని దూర్చడం అనేది హాస్యాస్పదంగా ఉందని.. రాష్ట్రంలో రోడ్లు నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అని పవన్ అన్నారు.. ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. సెస్స్ తీసుకుంటున్నారు. వెహికల్ సెస్ వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి. రోడ్ల అభివృద్ధికి వెళ్లాలి కదా? ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వైసీపీ ప్రజాప్రతినిధులే రోడ్లు బాగోలేక రాలేకపోతున్నామని చెబుతున్నారు. సంబంధిత మంత్రివర్గ పెద్దలు మాత్రం చాలా అభివృద్ధి సాధించేశాం. అద్భుతాలు చేసేశాం అంటున్నారు. కచ్చితంగా అద్భుతాలే చేశారు. చిన్న గోతులను గొయ్యిలు చేశారు. గొయ్యిల్ని కాలువలు చేశారు. అదీ.. మీరు చేసిన అద్భుతాలు. ఇవి అద్భుతాలు అంటే మేము కచ్చితంగా ఒప్పుకుంటాం. అలాగే వర్షాకాలం తర్వాత అక్టోబర్ నెల తరవాత రోడ్ల మరమ్మతు పనులు మొదలుపెడతాం అంటున్నారు. పోయిన ఏడాది అక్టోబర్ నెలలోనే చేయవచ్చు కదా? రోడ్లు సమస్య కొత్తగా ఇప్పుడొచ్చింది కాదు. నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు చూశా... ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో? అంతకు ముందు నుంచే సమస్య ఉంది. గ్రామాల్లో లింకు రోడ్లు చూస్తే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతుందని పవన్ అన్నారు.

రోడ్లు మృత్యుద్వారాలుగా మారాయని.. యాక్సిడెంట్లు చేసి చంపడానికి రెడీ గా ఉన్నాయని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బండి పది కిలోమీటర్లు వెళ్లొస్తే చాలు రిపేరు చేయించుకోవాలి. ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించుకోవాలి. అక్టోబర్ నెలలో టెండర్లు పిలుస్తాం అంటున్నారు. పాత పనులకే ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు చేసిన పనులకు ఎలా డబ్బులు ఇస్తారనే సందేహాలు కాంట్రాక్టర్లలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ నుంచి ఎలా పనులు మొదలుపెడతారో చూద్దాం. మేము అయితే మా పోరాటం ఆపం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అలాగే రోడ్లు నిర్మించే వరకు పోరాటం కొనసాగుతుందని పవన్ పిలుపునిచ్చాడు.