Begin typing your search above and press return to search.

భారత్ కు కీలక ఆధారాలు దొరికాయి

By:  Tupaki Desk   |   8 Jan 2016 8:15 AM GMT
భారత్ కు కీలక ఆధారాలు దొరికాయి
X
పటాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక ఆధారాల్ని భారత్ సంపాదించింది. పటాన్ కోట్ మీద దాడికి పాల్పడిన కుట్ర పాక్ నేల మీద నుంచే జరిగినట్లుగా నిరూపించే ఆధారాలు తాజాగా లభ్యమయ్యాయి. ఉగ్రవాద కార్యకలాపాల్ని నిర్వహించటం.. దానికి బాధ్యత వహించే విషయంలో తొండి ఆట ఆడే పాక్.. ఎప్పటిమాదిరి ఈసారీ ఉగ్రవాదులకు.. తమకు ఎలాంటి సంబంధం లేదన్న వాదన వినిపించే ప్రయత్నం చేసింది.

అయితే.. అలాంటి మాటలు నోటి వెంట రాకుండా ఉండే ఆధారాల్ని తాజాగా సేకరించిన భారత్.. తాజాగా తాము సేకరించిన వివరాల్ని పాక్ ముందు ఉంచింది. పటాన్ కోట్ కుట్ర పాక్ గడ్డ మీదనే జరిగిందన్న తిరుగులేని ఆధారాల్ని ఆ దేశం ముందు ఉంచింది. భారత్ భూభాగంలోకి ఆక్రమంగా ప్రవేశించిన ఉగ్రవాదులు పాక్ లోని తమ బాస్ కు ఫోన్ చేసిన ఫోన్ కాల్ కు సంబంధించిన వివరాలు తాజాగా లభ్యమయ్యాయి.

కారులో ప్రయాణించే సమయంలో క్యాబ్ డ్రైవర్ ఫోన్ నుంచి కాల్ చేసిన ఉగ్రవాదులు.. +92 3000597212 నెంబర్ కు చేసినట్లు గుర్తించారు. ఈ నెంబర్ కు ఫోన్ చేసిన ఉగ్రవాదులు.. అవతలి వ్యక్తిని ఉస్తాద్ గా సంభోదించారన్న విషయాన్ని గుర్తించారు. ఈ నెంబర్ తో పాటు.. మరో రెండు నెంబర్లకు కూడా ఫోన్ చేసినట్లు గుర్తించారు. అందులో ఒక ఫోన్ కాల్ ను ఉగ్రవాది ఒకరు తన తల్లికి చేసినట్లు గుర్తించారు. పాక్ గడ్డ మీద రూపుదిద్దుకున్న తాజా కుట్రకు సంబంధించిన ఆధారాలు భారత్ ఇచ్చిన నేపథ్యంలో దాయాది దేశం సమాధానం చెప్పక తప్పదు. పటాన్ కోట్ కుట్ర తమ గడ్డ మీదే జరిగిన విషయాన్ని అంగీకరించాల్సి పరిస్థితి.