Begin typing your search above and press return to search.

5 నిమిషాల సుఖానికి 500 ఎక్స్ ట్రా కాస్ట్

By:  Tupaki Desk   |   5 April 2016 5:30 PM GMT
5 నిమిషాల సుఖానికి 500 ఎక్స్ ట్రా కాస్ట్
X
కొద్దిరోజులుగా ఊరిస్తూ.. ఎట్టకేలకు మంగళవారం ప్రారంభమైన ద ఫాస్టెస్ట్ ఇండియన్ ట్రైన్ గతిమాన్ లో ప్రయాణించినవారు మాత్రం తీవ్రంగా అసంతృప్తికి లోనయ్యారు. మూడు రంగులతో ముచ్చటగా కనిపించిన ఈ ట్రెనుతో కొత్తగా వచ్చే ప్రయోజనమేమీ లేదని తేల్చేశారు. ఇండియాలోనే శరవేగంగా పరిగెత్తుతుందన్న ప్రచారం జరగడం... బోగీబోగీకి ఎయిర్ హోస్టెస్ ల తరహాలో రైల్ హోస్టెస్ లు... ఇలాంటివన్నీ విని... ఇంకేముంది! ఈ రైలెక్కిచూద్దాం అనుకొంటూ, 200 కిలోమీటర్ల ఢిల్లీ - ఆగ్రాల మధ్య ప్రయాణానికి రూ. 1500 పెట్టి టికెట్ కొనుక్కొని ఎక్కిన ప్రయాణికులకు నిరాశే మిగిలింది. ఈ మార్గంలో వెళ్లే శతాబ్ది ఎక్స్ ప్రెస్ తో పోలిస్తే కేవలం 7 నిమిషాల సమయాన్ని మాత్రమే గతిమాన్ ఎక్స్ ప్రెస్ ఆదా చేసిందట. దీంతో వారంతా ఇది వేస్టని తేల్చేశారు.

ఈ రూట్లో ప్రయాణించే శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో రూ. 1010 (ఏసీ ఎగ్జిక్యూటివ్) టికెట్ ధర ఉండగా, గతిమాన్ లో ఇదే క్లాస్ సీటుకు రూ. 1500 చెల్లించుకోవాలి. అంటే 500 అధికంగా చెల్లించాలి. 7 నిమిషాల కోసం 50 శాతం అధికంగా చెల్లించడం వృథా అని రైల్లో ప్రయాణించిన ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. కాగా, తొలి రోజు రైలు ప్రయాణంలో స్పానిష్ ఆమ్లెట్ - కేక్స్ - గోధుమ ఉప్మా - ఆలూ కుల్చా - కంజీవరం ఇడ్లీ - మినీ దోశ - చికెన్ రోల్స్ - స్విస్ రోల్స్ వంటి వెరైటీ ఆహార పదార్థాలను ప్రయాణికులకు అందించారు.