Begin typing your search above and press return to search.

తెలంగాణలో పార్టీ.. అన్న జగన్ తో విభేదాలు లేవు: షర్మిల

By:  Tupaki Desk   |   9 Feb 2021 11:10 AM GMT
తెలంగాణలో పార్టీ.. అన్న జగన్ తో విభేదాలు లేవు: షర్మిల
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వై ఎస్ షర్మిల మంగళవారం తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించి.. ఇన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు.

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో గల వారి నివాసంలో నల్గొండ నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులతో మాట్లాడిన షర్మిలా, తెలంగాణలో "రాజన్న రాజ్యం" (వైయస్ఆర్ పాలన) ను తీసుకురావడానికి కృషి చేస్తానని ప్రకటించారు. అయితే, అన్ని జిల్లాల నాయకులతో చర్చించిన తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తామని ఆమె చెప్పారు.

"ఇప్పుడు తెలంగాణలో సంక్షేమ ప్రభుత్వం లేదు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలుగన్న సంక్షేమ రాజ్యమైన రాజన్న రాజ్యాన్ని మనం ఎందుకు తీసుకురాకూడదు? రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాము, "అని ఆమె అన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో చర్చలు జరిపినట్లు షర్మిల తెలిపారు. "నేను క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను మిగతా అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడతాను.. అతి త్వరలో నేను కార్యాచరణ ప్రణాళికతో బయటకు వస్తాను "అని ఆమె చెప్పారు.

షర్మిల తన నివాసం వద్ద అభిమానుల నుండి అద్భుతమైన స్పందన నీరాజనాలు అందుకున్నారు. ఆమెపై వైఎస్ఆర్ అభిమానులు పూలవర్షం కురిపించారు. ఆమె తన నివాసం వద్ద నిర్మించిన డైస్ మీద నిలబడి అనుచరులను పలకరించారు. వారికి అభివాదం చేశారు. షర్మిల రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించడానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. నృత్యం చేశారు.

షర్మిల ఇంటి వద్ద వైసీపీ అభిమానుల కోలాహలం కనిపించింది. వైయస్ఆర్ అభిమానులను పెద్ద ఎత్తున ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సుమారు 100 మంది నాయకులు హాజరవుతారని భావించినప్పటికీ, ఆమెను ఉత్సాహపరిచేందుకు 3 వేలకు పైగా అభిమానులు ఆమె నివాసం వద్ద గుమిగూడడం విశేషం.

లోపల జరిగిన సమావేశంలో ఆమె అన్న, ఏపీ సీఎం జగన్ తో తనకు ఎలాంటి పోటీ ఉండదని.. ఎవరి పార్టీ వారిది అని.. అన్న ఆంధ్రా రాజకీయాల్లో ఉంటే.. తాను తెలంగాణ రాజకీయాల్లో ఉండబోతున్నానని ప్రకటించారు. పార్టీ జెండాను చేవెళ్లలో ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.