Begin typing your search above and press return to search.

హమ్మయ్యా... డబ్ల్యూహెచ్ఓ నుంచీ ఓ మంచి వార్త వచ్చింది

By:  Tupaki Desk   |   15 Aug 2020 1:30 AM GMT
హమ్మయ్యా... డబ్ల్యూహెచ్ఓ నుంచీ ఓ మంచి వార్త వచ్చింది
X
చైనాలోని వూహాన్ ను ప్రస్థానం ప్రారంభించి యావత్తు ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనాకు సంబంధించి ఇప్పటిదాకా అన్నీ చేదు వార్తలే వింటున్నాం. ఇక ప్రపంచ దేశాలకు ఆరోగ్య సూచనలు, జాగ్రత్తలు సూచించే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసినట్టుగా ప్రకటనలు జారీ చేస్తూ వస్తోంది. కరోనా గురించి డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇప్పటిదాకా వచ్చిన ప్రకటనలన్నీ దాదాపుగా ఈ కోవకు చెందినవే. తాజాగా డబ్ల్యూహెచ్ఓ నుంచి కరోనాకు సంబంధించిన జాగ్రత్తల్లో ఇప్పుడు ఓ శుభవార్త విడుదలైంది. ఆహారం నుంచి గానీ, ప్యాకేజీ నుంచి కరోనా రాదని డబ్ల్యూహెచ్ఓ ఓ మంచి వార్తను ప్రపంచ దేశాలకు అందించింది.

కరోనా విజృంభణ మొదలైన నాటి నుంచి చైనా ఏం చెబితే అదే తన మాట అన్నట్టుగా వ్యవహరించిన డబ్ల్యూహెచ్ఓ చాలా విమర్శలనే ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. విమర్శలకు తావిస్తూ వ్యవహరించిన కారణంగానే డబ్ల్యూహెచ్ఓ నుంచి ఏకంగా అమెరికా వైదొలగిన సంగతీ తెలిసిందే. అయినా కూడా డబ్ల్యూహెచ్ఓ ఏమాత్రం తన వైఖరిని మార్చుకున్నట్లుగా కనిపించలేదు. అంతేకాకుండా కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ విడుదలపైనా డబ్ల్యూహెచ్ఓ తనదైన శైలి ప్రకటనలు గుప్పించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని కూడా చెప్పక తప్పదు. మొత్తంగా కరోనా గురించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మినహా... ఆ వైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న దిశగా డబ్ల్యూహెచ్ఓ ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదన్న విమర్శలు లేకపోలేదు.

ఇలాంటి తరుణంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి శుక్రవారం ఓ శుభవార్త వచ్చింది. అదేంటంటే... ఆహర పదార్థాల నుంచి కరోనా వ్యాప్తి చెందదని ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆహార పదార్థాలతోనే కాకుండా ప్యాకేజింగ్ వస్తువుల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందదని కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు ఇంత వరకు ఒక్క కేసు కూడా రాలేదని ఆ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనికి సంబంధించి చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను డబ్ల్యూహెచ్ఓ ఆధారాలుగా చూపింది.

కొసమెరుపు - డబ్లుహెచ్ వో చెప్పిన విషయాన్ని దయచేసి అపార్థం చేసుకోకండి.. ఎందుకంటే... తిండి ద్వారా రాకపోవచ్చు. మీరు వెళ్లి నలుగురిని కలవడం ద్వారా మాాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ప్రమాదం ఉంది. ఆ విషయం మరువకండి.