Begin typing your search above and press return to search.

అరుదైన ఆదివాసీ తెగలో నలుగురికి కరోనా....టెన్షన్

By:  Tupaki Desk   |   27 Aug 2020 3:00 PM GMT
అరుదైన ఆదివాసీ తెగలో నలుగురికి కరోనా....టెన్షన్
X
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ బారిన పడిన దేశాలు అతలాకుతలమయ్యాయి. బాహ్య ప్రపంచానికి...జన సంచారానికి దూరంగా ఉంటే కరోనా బారిన పడకుండా ఉండవచ్చని చాలామంది భావించారు. అడవుల్లోని ఆదివాసీ తెగలు, సంచార జాతుల వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువని అనుకున్నారు. అయితే, తాజాగా ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మహమ్మారి అడవుల్లోని మారుమూల తెగలకూ సోకింది. భారతదేశంలోని అండమాన్‌ దీవులలో మారుమూల ప్రాంతంలో నివసించే ఓ ఆదిమ తెగలో తొలి కరోనా కేసు నమోదైంది. గ్రేటర్‌ అండమాన్‌ ప్రాంతంలోని స్ట్రెయిట్‌ ఐలాండ్‌లో ఉంటున్న నలుగురు గ్రేటర్ అండమానీస్ తెగకు చెందిన ఆదిమవాసులకు కరోనా సోకింది. వారిలో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చగా, మరో ఇద్దరిని క్వారంటైన్‌లో ఉంచారు. ఆ ప్రాంతంలో నివసించే 53 మంది గ్రేటర్‌ అండమానీస్‌ తెగలోని మిగతా వారందరికీ పరీక్షలు నిర్వహించగా వారికి నెగటివ్ వచ్చిందని పోర్ట్‌ బ్లేయర్‌లోని ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అవిజిత్‌ రాయ్‌ తెలిపారు. అయితే, వారందరినీ పరిశీలనలో ఉంచామని వెల్లడించారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లు ఉండే ఈ దీవి నుంచి ఆ తెగకు చెందిన వారు కొందరు తరచూ పోర్ట్ బ్లేయర్‌కు వస్తుంటారని, ఈ రాకపోకల వల్లే వారికి కోవిడ్‌-19 సోకి ఉంటుందని డాక్టర్‌ రాయ్‌ అన్నారు. అండమాన్‌ నికోబార్‌ ప్రాంతంలోని మిగతా ద్వీపాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటమే ఇప్పుడు తమ లక్ష్యమని డాక్టర్‌ రాయ్‌ తెలిపారు. ప్రస్తుతం అండమాన్‌లో అంతరించిపోయే దశలో ఉన్న జరవా, నార్త్‌ సెంటినెలీస్‌, గ్రేటర్‌ అండమనీస్‌, ఒంజే, షోంపెన్‌ అనే ఐదు ఆదిమ తెగలు ఉన్నాయి. ఆ తెగల వారిని అడవిలో మరింత లోపలికి పంపించి వైరస్ సోకకుండా కాపాడుతున్నామని అన్నారు. అండమాన్‌లోని ఇప్పటి వరకు 10 దీవులలో కోవిడ్‌-19 టెస్టులు నిర్వహించామని డాక్టర్‌ రాయ్‌ తెలిపారు. కోవిడ్‌-19 ట్రీట్‌మెంట్ కోసం రెండు ఆసుపత్రులు, మూడు హెల్త్‌ సెంటర్లు, పది కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.