Begin typing your search above and press return to search.

మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు ... ఈసారి గెలుపెవరిదో..?

By:  Tupaki Desk   |   6 Nov 2019 7:42 AM GMT
మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు ... ఈసారి గెలుపెవరిదో..?
X
ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. అప్పుడే మళ్ళీ ఎన్నికల నగరా మోగింది.అన్ని పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరో మూడు నెలల్లో జరిపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని పార్టీలు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుండి కోలుకోలేక పోతున్నాయి. ఈ సమయంలో మళ్ళీ ఎన్నికల నగరా మోగబోతుండటం తో పాత జ్ణాపకాలని మరచిపోయి , మళ్ళీ కొత్త ప్రణాలికలతో ఎన్నికల బరిలో దిగడానికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు మరో మూడు నెలల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఈ విధంగా తన సమాధానం తెలిపింది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణ మూర్తి హైకోర్టులో పిల్‌ వేశారు. దీనితో మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు.

ఇకపోతే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్ల పై రాజ్యంగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించింది. ప్రస్తుతం అధికారులు మొత్తం వాటిపైనే దృష్టి పెట్టారు. అయినప్పటికీ మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి తీరాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటుంది.

మరోవైపు రాష్ట్రంలో ఇసుక కొరత.. అమరావతి రాజధానిపై అస్పష్టత వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరితో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీపీ భావిస్తోంది. ఈ సమయంలో ఎన్నికలు వస్తే ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఇక ఈ ఎన్నికల పై జనసేన ఇంకా స్పందించలేదు. దీనితో ఏపీలో మళ్ళీ ఎన్నికల హడావిడి మొదలు కాబోతుండటంతో నేతలు చర్చల్లో మునిగితేలుతున్నారు. ఈ ఎన్నికలలో మరోసారి విజయం సాధించి .. పట్టు నిలుపుకోవాలని వైసీపీ నేతలు భావిస్తుంటే .. ఈ ఎన్నికలలో అయినా విజయం సాధించి టీడీపీ పోటీలోనే ఉంది అని చెప్పడానికి నేతలు విశ్వప్రయత్నాలు చేస్తునట్టు తెలుస్తోంది.