Begin typing your search above and press return to search.

పల్లాకు ఆక్రమణలంటేనే తెలీదట

By:  Tupaki Desk   |   15 Jun 2021 4:30 AM GMT
పల్లాకు ఆక్రమణలంటేనే తెలీదట
X
‘ప్రభుత్వ స్ధలాన్ని తాను ఎప్పుడూ అక్రమించలేదు’..ఇది తాజాగా టీడీపీ మాజీ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాసరావు ఇచ్చిన వివరణ. పైగా అధికారులు స్వాధీనం చేసుకున్న భూములు తనవి కానే కాదని చెప్పారు. మాజీ ఎంఎల్ఏ చెప్పింది కాసేపు నిజమే అనుకుందాం. మరి ఆక్రమించిన భూముల్లో నిర్మాణాలను కూల్చేస్తున్నపుడు పల్లా కుటుంబసభ్యులు+ టీడీపీ నేతలు అధికార యంత్రాగాన్ని ఎందుకని అడ్డుకున్నారు ?

ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో అక్రమ నిర్మాణాలను కూల్చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది. మరపుడు సదరు భూముల్లో ఉన్న నిర్మాణాలను కూల్చేందుకు లేదంటు పల్లాతో పాటు ఆయన సోదరుడు శంకర్రావు, టీడీపీ నేతలు ఎందుకని అడ్డుకున్నట్లు ? ఎవరి భూముల్లోనో ఉన్న నిర్మాణాలను ప్రభుత్వం కూల్చేస్తుంటే మధ్యలో పల్లా అండ్ కోకు వచ్చిన బాధేమిటి ?

పైగా మీడియాలో మాట్లాడుతు తన స్ధలం పక్కనే ఉన్న రోడ్డు తనకు మాత్రమే పనికొస్తుంది కాబట్టి తాను కలిపేసుకున్నట్లు ఆయనే స్వయంగా అంగీకరించారు. రోడ్డంటేనే ప్రభుత్వ స్ధలం కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఇదే సమయంలో పల్లా శంకరరావు ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు మాజీ ఎంఎల్ఏ సమాధానం ఇవ్వకుండానే సమావేశం ముగించేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మంత్రి, ఎంఎల్ఏ పదవులను అడ్డం పెట్టుకుని టీడీపీ హయాంలో చాలామంది ప్రభుత్వ భూములను కబ్జాచేసింది వాస్తవం. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు. స్వయంగా అప్పట్లో మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడే మీడియా సమావేశంలో చెప్పారు. తమపార్టీలోని నేతల్లో ఎవరెవరు ఎంతెంత భూములను ఆక్రమించుకున్నారనే విషయంపై తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్లు అయ్యన్న చెప్పటం అప్పట్లో సంచలనం రేపిందో తెలిసిందే.

ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అయ్యన్న నోరిప్పలేదు. అయితే టీడీపీ నేతల్లో చాలామంది ప్రభుత్వ భూములను ఆక్రమించేసుకున్నట్లు అప్పటి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తులో ఇందుకు ఆధారాలను ఇచ్చానని రాజుగారు చెప్పారు. భారీగా భూములను ఆక్రమించుకున్న తమ్ముళ్ళల్లో పల్లా కూడా ఒకరని అప్పట్లోనే బాగా ప్రచారం జరిగింది. అన్న పదవిని అడ్డుపెట్టుకుని తమ్ముడు ప్రభుత్వ భూములను స్వాదీనం చేసుకున్నాడని ఇపుడు తేలుతోందంతే.