Begin typing your search above and press return to search.

మన కోహినూర్ మీద దాయాది కన్ను

By:  Tupaki Desk   |   10 Feb 2016 10:03 AM IST
మన కోహినూర్ మీద దాయాది కన్ను
X
వందలాది సంవత్సరాలు మనల్ని దోచుకుతిన్న బ్రిటీషోడు వెలకట్టలేని ఎన్నో విలువైన వస్తువల్నితన దేశానికి తరలించటం తెలిసిందే. అలా తీసుకెళ్లిన వాటిల్లో అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఒకటి. భారత స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు కూడా బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తమకు ఇవ్వాలంటూ కోట్లాది భారతీయులు భావిస్తుంటారు. ప్రభుత్వాలు సైతం ఈ కోణంలో పని చేయాలన్న మాటను పలువురు ప్రస్తావిస్తుంటారు.

భారత్ నుంచి తీసుకుపోయిన నెమలి సింహాసనాన్ని.. కోహినూర్ వజ్రాన్ని బారత్ కు తిరిగి తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తూనే ఉంటుంది. ఈ వాదనకు తాజాగా మరో పోటీదారు వచ్చేశాడు. దాయాది దేశమైన పాక్.. కోహినూర్ వజ్రం తమదని చెప్పుకోవటం.. అందుకు తగ్గట్లుగా ఆ దేశానికి చెందిన జావెద్ ఇక్బాల్ అనే న్యాయవాది తాజాగా పాక్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు.

లాహోర్ హైకోర్టులో ఇతగాడు వేసిన పిటీషన్ మీద విచారణ జరిపిన కోర్టు.. పిటీషన్ పై విచారణ జరిపేందుకు ఓకే చెప్పేయటం గమనార్హం. ఈ వజ్రాన్ని బ్రిటన్ నుంచి తెప్పించేందుకు పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలన్న విన్నపంపై కోర్టు పరిశీలించనుంది. కోహినూర్ వజ్రం గుంటూరు జిల్లాలోని క్వారీలో బయటపడిందన్నది చారిత్రకసత్యం. ఆ విషయాన్ని వదిలేసి.. కోహినూర్ తమదేనంటూ దాయాది దేశం గళం వినిపిస్తున్న నేపథ్యంలో భారత్.. వెనువెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.