Begin typing your search above and press return to search.

మాస్క్ లేకపోతే కరెంట్ షాక్ ఇస్తున్న పోలీసులు...ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   10 Jun 2020 2:30 PM GMT
మాస్క్ లేకపోతే కరెంట్ షాక్ ఇస్తున్న పోలీసులు...ఎక్కడంటే ?
X
చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాలని గజగజ వణికిపోయేలా చేస్తుంది. మనదేశంలో కూడా ఈ వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇక మన దాయాది దేశం పాకిస్థాన్‌ లో కూడా వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పాక్ లో పాజిటివ్ కేసులు 113702 ఉండగా... మరణాలు 2255 ఉన్నాయి. వైరస్ ను ఎలా కంట్రోల్ చెయ్యాలో అక్కడి ప్రభుత్వానికీ, డాక్టర్లకూ, పోలీసులకూ అర్థం కావట్లేదు.

ప్రధానంగా అక్కడి ప్రభుత్వానికి ప్రజలు పెద్దగా సహకరించట్లేదు. మాస్కులు పెట్టుకోవట్లేదు. సోషల్ డిస్టాన్స్ పాటించడంలేదు. ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నా, అవేవీ వైరస్ ను ఆపట్లేదు. దాంతో ఫైసలాబాద్ పోలీసులు ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. అదే షాక్ ట్రీట్‌ మెంట్. ప్రజలకు కరెంటు షాక్ ఇస్తే... అప్పుడు కచ్చితంగా మాస్క్ వాడతారని భావించిన పోలీసులు, విదేశాల నుంచి కరెంట్ షాక్ ఇచ్చే ప్రత్యేక ఎలక్ట్రిక్ షాట్ గన్ పరికరాల్ని తెప్పించారు.

అవి లాఠీల లాగా ఉంటాయి. బటన్ నొక్కి, మనిషికి అంటిస్తే చాలు, కరెంటు షాక్ కొడుతుంది. ఈ షాక్ వల్ల మనిషికి ఎలాంటి అపాయమూ ఉండదు. కాకపోతే, అంటించినంత సేపూ మనకు నిజంగా కరెంటు షాక్ తగిలితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. పోలీసులు ఎప్పుడైతే షాక్ ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారో... ప్రజలకు టెన్షన్ మొదలైంది. పోలీసులను చూడగానే... వాళ్ల చేతుల్లో ఆ పరికరాలు ఉన్నాయేమో అని చూస్తున్నారు. పరికరాలు లేకపోతే... దర్జాగా పోలీసుల ముందుకు వస్తున్నారు. పరికరం ఉంటే మాత్రం... బాబోయ్ అనుకుంటూ... యూటర్న్ తీసుకొని ఇళ్లలోకి పారిపోతున్నారు. దీనితో అక్కడ ఇప్పుడిప్పుడే పోలీసులతో గొడవ దేనికిరా బాబు మాస్క్ పెట్టుకుంటే పోలేదా అని మాస్క్ పెట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నారు.