Begin typing your search above and press return to search.

దాయాదికి ప్రపంచ దేశాలు దిమ్మతిరగే షాక్ ఇవ్వనున్నాయా?

By:  Tupaki Desk   |   10 Nov 2020 2:30 AM GMT
దాయాదికి ప్రపంచ దేశాలు దిమ్మతిరగే షాక్ ఇవ్వనున్నాయా?
X
ఒక విమాన ప్రమాదం దాయాది పాకిస్తాన్ కు గుదిబండలా మారటమే కాదు. ఇప్పుడా దేశ ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావాన్ని చూపే వీలుందంటున్నారు. అంతేకాదు.. అంతర్జాతీయంగా దేశ పరువు ప్రతిష్ఠలు కుప్పకూలే దారుణ పరిస్థితికి కారణం కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది మేలో కరాచీలోని జనావాసాల మధ్య ఒక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 97 మంది దుర్మరణం పాలయ్యారు.

ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపం ఎంతమాత్రం కాదని.. కేవలం పైలెట్ తప్పిదంగా తేల్చారు. ఈ అంశంపై లోతైన విచారణ సందర్భంగా షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. దేశంలోని పైలెట్లలో దాదాపు 260కు పైగా పైలెట్లు బోగస్ అని.. తమకు బదులుగా వేరే వారి చేత పరీక్షలు రాయించి పైలెట్లుగా మారినట్లుగా గుర్తించారు. దేశంలోని 860 మంది పైలెట్లలో 30 శాతం పైలెట్లు బోగస్ పైలెట్లుగా తేలటంతో పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందంటున్నారు.

ప్రమాణాల్ని పాటించకుండా ఫేక్ పైలెట్లను విమానాల్ని నడుపుతున్న వైనాన్ని అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ సీరియస్ గా తీసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు 180 దేశాలు పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ రాకపోకలపై నిషేధాన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ సంస్థ కుప్పకూలిపోతుందంటున్నారు.

పైలెట్ల శిక్షణ.. లైసెన్సుల జారీ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా పాక్ ఏవియేషన్ సంస్థ తీరు లేదన్న విషయాన్ని పలుమార్లుచెప్పినా.. పాక్ సర్కారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదంటున్నారు. ఇప్పుడు ఇష్యూ సీరియస్ గా మారి.. పాక్ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసే వరకు వెళ్లింది. ఇప్పటికైనా ఇమ్రాన్ సర్కారు కళ్లు తెరిచి సత్వరమే చర్యలు తీసుకోకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెబుతున్నారు.