Begin typing your search above and press return to search.

జగన్ పార్టీ ఎమ్మెల్యే చిట్టిబాబు వేదనంతా ఆ వీడియోలో ఉందట

By:  Tupaki Desk   |   12 Nov 2020 5:20 PM IST
జగన్ పార్టీ ఎమ్మెల్యే చిట్టిబాబు వేదనంతా ఆ వీడియోలో ఉందట
X
మనసులో గూడుగట్టుకున్న వేదన అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేలు కొందరు తమ మనసులోని భావాల్ని బయటకు చెప్పేస్తున్నారు. ఇప్పటివరకు బిగపెట్టుకున్న వారంతా బరస్ట్ అవుతున్నారు. ఇలా చేస్తున్న వారి వాదనలో కొంత న్యాయం ఉంటే.. మరికొందరి బరితెగింపు బయటకు కనిపించేస్తోంది. పి.గన్నవరం ఎమ్మెల్యే వైఎస్సా్ర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టిబాబు మొదటి కోవకు చెందినోళ్లు.
తాజాగా ఆయన పాల్గొన్న సభలో చెప్పిన మాటలు చిట్టి వీడియోగా మారి.. వైరల్ అవుతోంది. అందులో.. తన ఆవేదనను పంచుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో తన పాలిట మంత్రులు దుష్టశక్తులుగా మారారని ఆయన ఆవేదన చెందారు.

వారి సహకారం లేకపోవటంతోనే తాను డెవలప్ మెంట్ చేయలేకపోతున్నట్లు చెప్పారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటులోనూ వారు అడ్డుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. పనులు జరగకుండా చేస్తున్నారన్నారు. సచివాలయ ఏర్పాటు తన పరిధిలో కానీ ఉంటే.. తాను వెంటనే అనుమతుల్ని ఇచ్చేసేవాడినని చెప్పిన ఆయన నోటి నుంచి మరో కీలక వ్యాఖ్య వచ్చింది.

‘మనమంతా కలిసే ఉన్నాం. మంత్రులు మాత్రం ప్రజల మధ్య విభజన తెచ్చేలా మాట్లాడుతున్నారు’ అంటూ చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలంగా మారాయి. చూస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేల్ని తరచూ కలుస్తూ.. గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందన్న విషయానికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ను తెలుసుకుంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.