Begin typing your search above and press return to search.

ఐఎన్‌ఎక్స్‌ కేసు లో చిదంబరానికి బెయిల్ !

By:  Tupaki Desk   |   4 Dec 2019 7:14 AM GMT
ఐఎన్‌ఎక్స్‌ కేసు లో చిదంబరానికి బెయిల్ !
X
గత కొన్ని రోజులుగా ఐ ఎన్ ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది.

తాజాగా సుప్రీం చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల తో కూడిన సుప్రీం ధర్మాసనం ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది.

అయితే, దర్యాప్తు సంస్థ అడిగినప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సాక్ష్యాలను మార్చొద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి చిదంబరం ఎలాంటి ప్రకటనలు చేయోద్దని, మీడియాతో కూడా మాట్లాడొద్దని తెలిపింది. రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును తీవ్ర ఆర్థిక నేరంగా పరిగణించి బెయిల్ ఇవ్వవద్దని ఈడీ సుప్రీం కోర్టు లో వాదనలు వినిపించింది. కానీ , సుప్రీం వాదనని తోసిపుచ్చి బెయిల్ మంజూరు చేసింది.

అలాగే ఆయనని తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. కాగా, ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీల్యాండరింగ్‌ కేసులో ఆగస్ట్‌ 21న చిదంబరం అరెస్ట్‌ అయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా లోకి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు తరలించారని అభియోగాలతో ఈయనను అరెస్టు చేశారు. అరెస్ట్‌ అయిన 105 రోజుల తర్వాత ఈడీ కేసులో ఆయనకి బెయిల్‌ లభించింది.