Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నికల ప్రచారంలో ఓవైసీ లెటేస్ట్ హాట్ కామెంట్స్..

By:  Tupaki Desk   |   6 Feb 2022 2:33 PM GMT
యూపీ ఎన్నికల ప్రచారంలో ఓవైసీ లెటేస్ట్ హాట్ కామెంట్స్..
X
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల తన కారుపై జరిపిన కాల్పులపై ఆయన ఘాటుగా స్పందించారు. ఉత్తప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం రాష్ట్రంలో పలు చోట్ల పోటీ చేస్తోంది. తాజాగా ఆయన ఎంఐఎం అభ్యర్థి అనీస్ అహ్మద్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క ఓవైసీని కాల్చితే లక్షల మంది ఓవైసీలు పుట్టుకొస్తారని అన్నారు. మహాత్మాగాంధీపై కాల్పలు జరిపిన వారికి సంబంధమున్నవారే తనపై కాల్పులు జరిపారని విమర్శించారు. తనపై కాల్పులు జరిపిన వారికి బీజేపీతో సంబంధాలున్నాయని తెలుస్తోందని ఓవైసీ ఆరోపించారు.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపీ యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల మేరఠ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీ వెళ్తుండగా తన కారుపై కాల్పులు జరిగాయి. అయితే ఆయనకు సీఆర్ పీఎఫ్ బలగాలతో జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ తనకు జడ్ కేటగిరి అవసరం లేదని అన్నారు. అందరిలాగే ‘ఏ’ కేటగిరి పౌరుడిగానే ఉంటాన్నారు. కాల్పులు జరిపిన వారిని చూసి ఏమాత్రం భయపడనని, దాడి చేసిన వారికి ఓటింగ్ ద్వారా సమాధానం ఇస్తానన్నారు.

తాజాగా ఆయన చాప్రౌలీ నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడి ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆసరా గ్రామంలో ఆయన మాట్లాడుతూ ‘ నాడు మహాత్మగాంధీని కాల్చిన వారే తనను హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారు. వాస్తవాలు మాట్లాడుతుండడం, బీజేపీ కళ్లల్లోకి సూటిగా చూసే ధైర్యం చేస్తుండడంతోనే తనపైకాల్పులు జరిపారు. అయితే ఒక్క ఓవైసీని కాల్చితే లక్షల మంది ఓవైసీలు పుట్టుకొస్తారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఓవైసీపై కాల్పులు జరిపిన ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరికి బీజేపీతో సంబంధాలున్నాయన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీతో పాటు సమాజ్ వాదీ పార్టీపై కూడా ఓవైసీ విమర్శలు చేశారు. ఎన్నికలు ముగిశాక అఖిలేశ్ హామీలను మరిచిపోతారన్నారు. హామీలను తుంగలో తొక్కిన ఘనత అఖిలేశ్ ది అని అన్నారు. మైనారిటీలకు అఖిలేశ్ లాలీపాప్ ఇస్తారని ఎద్దేవా చేశారు. కాగా ఓవైసీ కారుపై కాల్పుల ఘటనపై ఆయనకు జడ్ కేటగిరి కల్పించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 22 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కేటాయించాలని అనుకున్నారు. కానీ ఓవైసీ దానిని తిరస్కరించారు.