Begin typing your search above and press return to search.

ఆక్సిజన్ కొరత ... గాలి నుంచి ఆక్సిజన్ ,సూరత్ లో ప్రయోగం

By:  Tupaki Desk   |   23 April 2021 6:31 AM GMT
ఆక్సిజన్ కొరత ...  గాలి నుంచి ఆక్సిజన్ ,సూరత్ లో ప్రయోగం
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మాములుగా లేదు. మొదటి వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత నెల రోజుల క్రితం ఉన్న పరిస్థితులకి, ప్రస్తుత పరిస్థితులకి అసలు పోలికే లేదు. కేవలం రెండు వారాల గ్యాప్ లోనే వేలల్లో ఉన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు , లక్షల్లోకి చేరిపోయాయి. ప్రస్తుతం దేశంలో మూడు లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే ప్రపంచంలో ఒక్కరోజులో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇండియానే అగ్రస్థానం లో ఉంది. దీనితో దేశంలోని చాలా రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్ అలాగే నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకువచ్చారు. మరికొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే .. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా భారిన పడిన వారు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య శ్వాస సమస్య. శ్వాస తీసుకోలేకపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ ఫుల్ అవుతున్నాయి. ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితో మెడికల్ ఆక్సిజన్ సీలిండర్లు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే పలు ప్లాంట్స్ లో మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తూ అవసరం అని భావించిన రాష్ట్రాలకి రైళ్లల్లో తరలిస్తున్నారు. ఆక్సిజన్ కొరత ను గమనించిన సూరత్ లోని న్యూసివిల్ ఆసుపత్రి ఓ నూతన ప్రయోగాన్ని చేపట్టింది. గాలి నుంచి నిమిషానికి మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ను తయారు చేస్తున్నది. సూరత్ లో కరోనా బాధితుల కోసం నితం 250 టన్నుల ఆక్సిజన్ అవసరం అవడంతో కేంద్రం న్యూసివిల్ ఆసుపత్రిలో పీఎస్ ఏ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ లో గాలి నుంచి ఆక్సిజన్ ను తయారు చేస్తూ అవసరమైన కరోనా బాధితులకు అందిస్తున్నారు.

గాలిలో 20.6శాతం ఆక్సిజన్‌, 78.03శాతం నైట్రోజన్‌, 0.93 శాతం ఆర్గాన్‌ గ్యాస్‌, ఇతర మూలకాలు ఉంటాయి. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లలో గాలి నుంచి ప్రాణవాయువును తయారు చేస్తారు. మైనస్‌ 183 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద క్రయోజనిక్‌ ఎయిర్‌ సప్రెషన్‌ విధానం ద్వారా ఆక్సిజన్‌ను వేరు చేస్తారు. అలా గ్యాస్‌ రూపంలో లభ్యమయ్యే ప్రాణవాయువును ద్రవరూపంలోకి మార్చి వడబోస్తే.. 99.9శాతం స్వచ్ఛతతో ఆక్సిజన్‌ లభిస్తుంది. ఇలా లక్ష ఘనపు మీటర్ల సాధారణ గాలిని గంట పాటు ప్రాసెస్‌ చేస్తే.. 13,500 నుంచి 18,500 ఘనపు మీటర్లలో ద్రవరూప ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇలా తయారైన ఆక్సిజన్‌ను జంబో ట్యాంకర్లలో స్టోర్‌ చేస్తారు. నిర్ణీత ఉష్ణోగ్రతలో క్రయోజనిక్‌ ట్యాంకుల ద్వారా ఈ ఆక్సిజన్‌ ను డిస్ట్రిబ్యూటర్లకు పంపుతారు. డిస్ట్రిబ్యూటర్లు ద్రవరూపంలో ఉండే ఆక్సిజన్‌ను రీగ్యాసిఫికేషన్‌ ద్వారా మళ్లీ గ్యాస్‌ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. దాన్ని ఆస్పత్రులకు పంపుతారు.