Begin typing your search above and press return to search.

40 మందికిపైగా చైనా సైన్యం చనిపోయారట !

By:  Tupaki Desk   |   21 Jun 2020 12:30 PM GMT
40 మందికిపైగా చైనా సైన్యం చనిపోయారట !
X
లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనాకు కూడా భారీగా ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 15న చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనితో వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ కూడా ఎదురు దాడికి దిగింది. ఈ హింసాత్మక ఘర్షణలో మన జవాన్లు 20మంది వీరమరణం పొందారు. అయితే, చైనా తరఫున జరిగిన ప్రాణ నష్టమెంత అనేదానిపై ఇప్పటివరకు చైనా నోరు మెదపలేదు. కాగా, తొలిసారిగా భారత ప్రభుత్వం ఆ లెక్కను తేల్చింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్ ‌ఏ) కు చెందిన 40 మందికి పైగా సైనికులను చైనా కోల్పోయిందని కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధికారి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు.

చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనే విషయంపై ప్రభుత్వం తరఫున స్పందించడం ఇదే తొలిసారి. 1962 భారత్‌-చైనా యుద్ధంలో కూడా ఆ దేశం తమ సైనికుల మరణాలను దాచిపెట్టిందని వీకే సింగ్ విమర్శించారు. గాల్వన్ లోని సైనిక పోస్టు-14 భారత్‌ అధీనంలోనే ఉందన్నారు. నిర్బంధించిన కొందరు భారత సైనికులను చైనా విడుదల చేసిందనే వార్తలపై ఆయన స్పందించారు. ‘‘మన భూభాగంలోకి వచ్చిన చైనా సైనికులను మనవాళ్లు కూడా నిర్బంధించారు. ఆ తర్వాత వారిని విడుదల చేశాం’’ అని చెప్పారు.

వాస్తవాధీన రేఖ దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణ నష్టం సంభవించడం గత 45ఏళ్లలో ఇదే తొలిసారి. భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్‌ దగ్గర జరిగిన గొడవే కారణమని సమాచారం. వాస్తవాధీన రేఖకు(ఎల్‌ ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ ఏర్పాటు చేశారు,

సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. శత్రు దేశ ట్యాంకర్లను ఛిద్రం చేయగల.. ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్‌ అపాచీ, సరికొత్త రాడార్‌ సాంకేతికతతో కూడిన.. మిగ్‌-29 ఫైటర్‌ జెట్‌ లు, సత్వరమే ఆయుధాలను చేరవేసే చినూక్‌ హెలికాప్టర్లు.. ఇలా వాయుసేన అమ్ములపొదిలోని ఒక్కో అస్ర్తాన్ని వాస్తవాధీన రేఖ దగ్గర భారత్‌ మోహరిస్తోంది. చైనాతో గాల్వన్ లోయ దగ్గర తీవ్ర ఘర్షణ.. జవాన్ల వీర మరణం నేపథ్యంలో ఇప్పటికే సైన్యం అప్రమత్తం కాగా, వాయు సేన దానికి తోడవుతోంది. అటు పొరుగు దేశం సైతం దీనికి తగ్గట్లే బలగాలు, యుద్ధ విమానాలను మోహరిస్తోంది. దీంతో ప్రస్తుతం బోర్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొంది.