Begin typing your search above and press return to search.

ఒకరు ఎన్టీఆర్.. ఇంకొకరు కేసీఆర్ అంటున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   27 April 2019 1:29 PM IST
ఒకరు ఎన్టీఆర్.. ఇంకొకరు కేసీఆర్ అంటున్న కేటీఆర్
X
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరని.. అందులో ఒకరు నందమూరి తారక రామారావు అయితే.. మరొకరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని.. తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సం సందర్బంగా టీఆర్ ఎస్ భవన్‌లో కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌ అద్భుత ఫలితాలు రాబట్టారని.. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాజకీయాల్లోకి వచ్చారని.. ఐతే ఎన్టీఆర్‌ తో పోలిస్తే అనేక సవాళ్లను కేసీఆర్ ఎదుర్కొన్నారని కేటీఆర్ అన్నారు.

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉందని, ఎన్టీఆర్‌ సినిమా స్టార్ కావడంతో‌...అప్పట్లో ఆయనకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని అన్నారు. కానీ కేసీఆర్‌ కు ఎలాంటి అనుకూలతలు లేవన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని 2001లో కేసీఆర్‌ ఒంటరిగా మొదలు పెట్టారన్న కేటీఆర్.. 71 ఏళ్ల తెలంగాణ చరిత్రలో ఉద్యమం కోసం ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయని.. కానీ గట్టిగా నిలబడిన పార్టీ టీఆర్ ఎస్‌ ఒక్కటేనని కేటీఆర్ అన్నారు. తాను ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టండని ఆనాడు కేసీఆర్‌ చెప్పారని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్లలో అన్నీ ప్రతికూల పరిస్థితులే ఏర్పడ్డాయని కేటీఆర్‌ చెప్పారు. 2001 నుంచి 2019 వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణవాదులు సైనికుల్లా పోరాటం చేశారని కొనియాడారు.

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ ప్రభంజనం కొనసాగిందని.. రాష్ట్రంలో 16 లోక్‌ సభ స్థానాలను టీఆర్ ఆర్ కైవసం చేసుకుంటుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌దే గెలుపని అన్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలోనే పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నామన్నారు. కేసీఆర్‌ లాంటి నాయకుడు తమకు ఎందుకు లేరని... వేరే రాష్ట్రాల వారు భావించే పరిస్థితి ఉందని, అయితే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవడాన్ని ఓర్వలేని వాళ్లు... దుష్ప్రచారం చేసేందుకు గుంటనక్కల్లా వేచి ఉన్నారని కేటీఆర్‌ విమర్శించారు.