Begin typing your search above and press return to search.

మ‌ణి ఎవ‌రి మెడ‌లో ఒదిగేనో ?

By:  Tupaki Desk   |   10 Jan 2022 9:30 AM GMT
మ‌ణి ఎవ‌రి మెడ‌లో ఒదిగేనో ?
X
అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల వచ్చేయ‌డంతో దేశంలో మ‌రోసారి ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్, పంజాబ్‌, మ‌ణిపూర్‌, గోవాల్లో ఫిబ్ర‌వ‌రి నుంచి మార్చిలోపు పోలింగ్ జ‌రుగుతుంది. ఒక్క పంజాబ్‌లో త‌ప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి త‌మ అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు క‌మ‌ల‌నాథులు వ్యూహాల్లో మునిగిపోయారు. ఈ క్ర‌మంలో ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి.

60 అసెంబ్లీ సీట్లు ఉన్న మ‌ణిపూర్‌కు రెండు ద‌శ‌ల్లో ఫిబ్ర‌వ‌రి 27, మార్చి 3వ తేదీన పోలింగ్ జరుగుతుంది. మార్చి 10న ఫ‌లితాలు వెలువ‌డుతాయి. 2017 ఎన్నిక‌ల్లో ఫ‌లితాల త‌రువాత చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో తొలిసారిగా బీజేపీ ఇక్క‌డ అధికారంలోకి వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకుంది. కానీ ఆ త‌ర్వాత ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. మ‌రోవైపు 21 సీట్లు గెలుచుకున్న‌ప్ప‌టికీ బీజేపీ.. నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్‌, లోక్ జ‌న‌శ‌క్తి పార్టీతో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆ కూట‌మిలో కీల‌క పార్టీగా ఉన్న ఎన్సీపీ ఈ సారి ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టికే 30 మంది అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసింది.

దీంతో ఎన్సీపీ ఒంట‌రిగానే పోటీ చేసే అవ‌కాశం ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ పార్టీ 9 సీట్ల‌లో పోటీ చేసింది. మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి మెజార్టీ స్థానాలు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత చోటు చేసుకున్న అనుభ‌వాల‌తో కాంగ్రెస్ పాఠాలు నేర్చుకుంది. దీంతో ఈ సారి జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించేలా క‌నిపిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి జైరాం ర‌మేష్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ క‌మిటీ ఏర్పాలు చేశారు.

ఇప్పుడు ఎన్నిక‌ల షెడ్యూల్‌ విడుద‌ల కావ‌డంతో కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తుతో అధికారం ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. అధికారంలో ఉన్న బీజేపీ మ‌రోసారి సీఎం కుర్చీని ద‌క్కించుకునేందుకు వ్యూహ ర‌చ‌న‌లో మునిగిపోయింది. కానీ ఈ సారి దేశ‌వ్యాప్తంగా మోడీ ప్ర‌భ త‌గ్గుతుండ‌డంతో.. కేంద్రంలోని బీజేపీ అధికారంపై వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో ప‌రిస్థితులు మారేలా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఈ వ్య‌తిరేక ప‌వ‌నాల‌ను త‌ట్టుకుని బీజేపీ ఎలా మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుందో చూడాలి. మ‌రోవైపు దేశ్య‌వాప్తంగా తిరిగి పుంజుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న కాంగ్రెస్‌.. మ‌ణిపూర్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో బ‌లం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌లితాలే అందుకు నిద‌ర్శ‌నం. మ‌రి ఈ సారి కాంగ్రెస్ ఏం చేస్తుందోన‌న్న ఆస‌క్తి క‌లుగుతోంది.