Begin typing your search above and press return to search.

కచ్చులూరు ప్రమాదానికి ఏడాది.. నేటికీ ఆ బోటు ప్రమాదం ఓ పీడకలే !

By:  Tupaki Desk   |   15 Sep 2020 2:30 PM GMT
కచ్చులూరు ప్రమాదానికి ఏడాది.. నేటికీ ఆ బోటు ప్రమాదం ఓ పీడకలే !
X
పాపికొండల మధ్య హొయలు పోతూ సాగే గోదావరిని చూసేందుకు ఎంతోమంది నిత్యం వెళ్తుంటారు. అయితే , ఆ గోదారమ్మ అందాలని చూడటానికి వెళ్లిన కొంతమంది ఏకంగా ఆ గంగమ్మ ఒడిలోనే కలిసిపోయారు. 51మందిని బలి తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం జరిగింది ఏడాది. ఈ ప్రమాదం నేటికీ ఆ కుటుంబాలకి ఓ పీడకలే .. ఈ ప్రమాదంలో కొంతమందికి తమ కుటుంబ సభ్యుల చివరి చూపూ దక్కని పరిస్థితి.. కళ్ల ముందే తమ కుటుంబ సభ్యులు నీళ్లలో కొట్టుకుపోతున్నా కాపాడలేని నిస్సహాయత. ఇలా ఏ కుటుంబాన్ని కదిల్చినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయి.

వశిష్ట పున్నమి రాయల్‌ బోటులో బయల్దేరిన 77 మంది ప్రయాణికులు.. గోదావరి కల్లోలానికి కకా వికలమయ్యారు. గత ఏడాది సెప్టెంబర్‌ 15 వ తేదీన రాజమండ్రిలో బయల్దేరిన బోటు... తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద మునిగిపోయింది. నాటి దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన 51 మంది జలసమాధి కాగా.. వీరిలో ఐదుగురి మృతదేహాలు లభించనే లేదు. 26 మందిని మాత్రం స్థానికులు సురక్షితంగా ఒడ్డుకి చేర్చారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో జరిగిన ఈ ప్రమాదంలో నీట మునిగిన బోటును తీసేందుకు... వివిధ బృందాలు కలిసి 38 రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. తొలుత బోటును బయటకు తెచ్చేందుకు ముందుకువచ్చిన నేవీ, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఆ తర్వాత చేతులెత్తేశాయి. దీంతో రాయల్ వశిష్ట బయటికి రావటం అసాధ్యమని భావించారంతా. కానీ ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ధర్మాడి సత్యం.

గాలింపు క్రమంలో 46 మృతదేహాలు లభ్యంకాగా.. మరో ఐదుగుర్ని గుర్తించలేకపోయారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షలు, స్వల్పంగా గాయపడిన, గాయాలు లేకుండా బయటపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇచ్చారు. తెలంగాణ వారికి అక్కడి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున అదనంగా అందించింది. కేంద్రం రూ.2 లక్షల ఇచ్చింది. నిబంధనలను తుంగలో తొక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే దానిపై విచారణ కమిటీ ఏమీ తేల్చలేకపోయింది. ఏపీ జలవనరుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఛైర్మన్‌గా విచారణ కమిటీ వేయగా.. ప్రమాదానికి కారణాలను పెద్దగా విశ్లేషించకుండానే... భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా సూచనలు చేసింది.