Begin typing your search above and press return to search.

మరోసారి ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్

By:  Tupaki Desk   |   6 Dec 2020 1:53 PM IST
మరోసారి ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్
X
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగలడం.. తెలంగాణపై బీజేపీ దండయాత్ర నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి బీజేపీని టార్గెట్ చేసి జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యామ్మాయం దిశగా అడుగులు వేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో భేటి అయ్యి చర్చలు జరిపారు. బీజేపీ గెలవడంతో అందరూ ఊరుకున్నారు. ఇప్పుడు బీజేపీ దండయాత్ర నేపథ్యంలో కేసీఆర్ దుమ్ము దులిపేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగానే.. జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) పార్టీ ముఖ్య నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఫోన్‌ చేసి భేటీ అవుదామని కోరారు. ఈ విషయాన్ని శనివారం కుమార స్వామి మైసూరులో మీడియాకు వివరించారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ రహిత ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జరిగే సభలో తప్పకుండా పాల్గొనాలని భవిష్యత్తులో కలిసి నడుద్దామని కోరారు. పాల్గొనేందుకు నేను సిద్ధమని హామీ ఇచ్చా’ అని తెలిపారు.

రాష్ట్ర రాజకీయాలను కేటీఆర్ కు అప్పగించి జాతీయ రాజకీయాలకు వెళ్లాలని కేసీఆర్ యోచించారు అయితే ఫెడరల్ ఫ్రంట్ కల సాకారం కాకపోవడంతో మిన్నకుండిపోయారు. తాజాగా మరోసారి దాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.