Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ వేళ.. పిల్లల గురించి కేంద్రం కీలక మార్గదర్శకాలు

By:  Tupaki Desk   |   21 Jan 2022 6:30 AM GMT
ఒమిక్రాన్ వేళ.. పిల్లల గురించి కేంద్రం కీలక మార్గదర్శకాలు
X
కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన ఒమిక్రాన్ కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

మనదేశంలోనూ థర్డ్ వేవ్ రూపంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అయితే పిల్లల్లో కరోనా ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

18ఏళ్ల లోపు వారు, ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ మెడిసిన్ ఉపయోగించాలో కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది.

కరోనా కట్టడిలో మాస్క్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఐదేళ్లలోపు చిన్నారులు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని సవరించిన మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.

పిల్లలకు సరిగ్గా మాస్క్ ధరించడం రానందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక ఆరు నుంచి 11 ఏళ్ల పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్క్ ధరించడం సురక్షితమని అభిప్రాయపడింది. 12 ఏళ్ల వారంతా కూడా పెద్దల మాదిరిగానే మాస్క్ ను విధిగా ధరించాలని సూచించింది.

ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసింది.వివిధ దేశాల్లోని ఒమిక్రాన్ ప్రభావం డేటాను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే కొత్త వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. ఇది అంత ప్రమాదకరం కాకపోయినా అతి వేగంగా విస్తరించే లక్షణాలను కలిగి ఉందని వెల్లడించింది.

ఈ కేసుల్లో మూడు రకాలు ఉన్నాయని చెప్పింది. వాటిలో లక్షణాలు లేనివి, తేలికపాటి లక్షణాలు గల కేసులు, అతి తీవ్రమైన లక్షణాలు గలవారుగా వర్గీకరించినట్లుగా వివరించింది. లక్షణాలు తీవ్రంగా లేనివారికి అనవసరమైన ఔషధాలను ఇవ్వకూడదని తేల్చి చెప్పింది.

లక్షణాలు తక్కువగా ఉన్నవారు, తేలికపాటి లక్షణాలు గలవారికి యాంటీమైక్రోబయాల్స్, ప్రొఫిలాక్సిస్ సిఫార్సు చేయడం లేదని చెప్పింది. ఇకపోతే తీవ్రమైన లక్షణాలు కలిగి ఉంటేనే స్టెరాయిడ్స్ ను వినియోగించాలని సూచించింది. వాటిని సరైన సమయంలో, సరైనా మోతాదులో ఇవ్వాలని పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇకపోతే థర్డ్ వేవ్ లో కరోనా ప్రభావంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పింది. ఆ డేటా ఆధారంగా మరిన్ని మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని స్పష్టం చేసింది.

దేశంలో రోజూవారి కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.వివిధ రాష్ట్రాల్లోనూ వేల సంఖ్యలో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ తర్వాతి నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. పల్లెల్లో పట్టణాల్లో విపరీతమైన పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఫీవర్ సర్వేను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.