Begin typing your search above and press return to search.

7 సార్లు ఎమ్మెల్యే గా గెలిచాడు కానీ , కరోనా పై పోరులో ఓడిపోయాడు !

By:  Tupaki Desk   |   5 Oct 2020 4:00 PM IST
7 సార్లు ఎమ్మెల్యే గా గెలిచాడు కానీ , కరోనా పై పోరులో ఓడిపోయాడు !
X
కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు , ప్రముఖుల నుండి రాజకీయ నేతల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. రానురాను కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా కరోనా బారిన పడి ఒడిశాలోని ఓ ఎమ్మెల్యే మృతి చెందారు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రదీప్ మహారథి కరోనాతో ఆదివారం కన్నుమూశారు.

ఈయన ఒడిశా రాష్ట్రంలోని పిపిలి నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పూరీ జిల్లాలోని పిపిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రదీప్ మహారథికి సెప్టెంబర్ 14న కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఎమ్మెల్యే ప్రదీప్.. కరోనా నుండి కోలుకొని డీఛార్జ్ అయ్యారు. ఆ తరువాత రెండు రోజుల క్రితం మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. శుక్రవారం పరిస్థితి మరింతగా మించడంతో అయనకి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు వైద్యులు.. ఈ క్రమంలో అయన ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రదీప్ ఎంతగానో శ్రమించారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన ఆయన.. చివరకు ఆ మహమ్మారి బారినే పడి మరణించడం బాధాకరం.

ఒడిశాలోని పిపిలి నియోజకవర్గం జనతా పార్టీ నుంచి 1985లో ప్రదీప్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఆయనే గెలవడం విశేషం. నవీన్ పట్నాయక్ కేబినెట్‌లో వ్యవసాయ, పంచాయతీ రాజ్ మరియు మత్స్యశాఖ మంత్రిగా కూడా ప్రదీప్ పనిచేశారు. వ్యవసాయ రంగంలో అయన చేసిన కృషికి గాను 2016 లో గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు, 2014-15 కృషి కర్మన్ అవార్డు లభించింది. అయన మృతి పట్ల సీఎం నవీన్ పట్నాయక్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలుపుతున్నారు. ఇక ప్రదీప్ మహారథికు భార్య ప్రతివా మహారథి, కుమారుడు రుద్ర ప్రతాప్‌ మహారథి, కుమార్తె పల్లవి మహారథి ఉన్నారు