Begin typing your search above and press return to search.

తల్లీబిడ్డలను వేరు చేస్తోన్న 'వీసా' నిబంధన

By:  Tupaki Desk   |   12 May 2020 8:00 PM IST
తల్లీబిడ్డలను వేరు చేస్తోన్న వీసా నిబంధన
X
కరోనా మహమ్మారి పంజా విసరడంతో స్వదేశానికి పయనమవ్వాలని వేలాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురు చూశారు. దాదాపు నెలన్నర రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారందరికీ భారత ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు `వందే భారత్ మిషన్` చేపట్టింది. ఈ మిషన్ ద్వారా నడుపుతున్న ప్రత్యేక విమానాల్లో ఎన్నారైలను భారత్ కు కేంద్రం తీసుకువచ్చేందుకు విధివిధానాలు రూపొందించింది. అమెరికాలో చాలామంది హెచ్ 1 బీ వీసా గడువు ముగిసింది. 60 రోజుల్లోపు వారంతా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. ఆ గడువును పెంచాలని ట్రంప్ కు మనవాళ్లు చేసిన వినతి...పెండింగ్ లో ఉంది.

మరోవైపు, కరోనా విపత్తు వల్ల అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు పోయాయి. దాదాపు మూడు కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. ఈ నేపథ్యంలో అమెరికాలో హెచ్ 1బీపై ఉద్యోగం దొరకడం కష్టం. హెచ్ 1బీ వీసా గడువు ముగిసిన వారితోపాటు...కొంత మంది భారతీయులు స్వదేశాలకు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. కూలో గంజో తాగి మన దేశంలో ఉందామని చాలామంది డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తమ పిల్లలతో కలిసి భారత్ కు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, తీరా విమానాశ్రయంలోకి వెళ్లిన తర్వాత వారికి షాక్ తగులుతోంది.

అమెరికాలో పుట్టిన పిల్లలను భారత్ వెళ్లేందుకు అనుమతించబోమని అమెరికా అధికారులు చెప్పడంతో తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో అంతర్జాతీయ ప్ర‌యాణాల‌పై భారత ప్రభుత్వం విధించిన ఆంక్ష‌లే ఇప్పుడు ఎన్నారై తల్లిదండ్రుల పాలిట శాపంగా మారాయి. వీసా అవ‌స‌రం లేకుండా భార‌తీయుల‌ను స్వ‌దేశానికి వచ్చేందుకు అవ‌కాశం క‌ల్పించే 'ఓవ‌ర్సీస్ సిటిజ‌న్స్ ఆఫ్ ఇండియా'(ఓసీఐ) కార్డుల‌పై గ‌త నెల‌లో భారత్ నిషేధం విధించడమే ఇందుకు కారణం.

అమెరికాలో చిక్కుకున్న ఎన్నారైలకు తాజాగా కొత్త‌ స‌మ‌స్య వ‌చ్చింది. చాలామందికి వీసా ఉన్నా స్వ‌దేశానికి రాలేని ప‌రిస్థితి ఏర్పడింది. కొవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతున్నందున గతంలో ఓసీఐపై కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు అమెరికాలో చిక్కుకున్న కొంత‌మంది భార‌తీయుల‌ పాలిట శరాఘాతంగా మారింది. వీసా, గ్రీన్‌కార్డు ఉన్న‌ ఎన్నారైల పిల్ల‌లు అక్క‌డే పుట్ట‌డంతో వారంద‌రూ ఓసీఐ ప‌రిధిలోకి వ‌స్తారు. దీంతో, భారత ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తల్లిదండ్రులు మాత్రమే ప్ర‌యాణించేందుకు అక్క‌డి అధికారులు అంగీక‌రిస్తున్నారు.

ఓసీఐ ప‌రిధిలోకి వచ్చే పిల్ల‌ల‌ను మాత్రం అనుమ‌తించ‌డం లేదు. ఈ విషయంలో తాము నిస్సహాయులమని...భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారమే తాము విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'వందే భార‌త్ మిష‌న్' కొన్ని కుటుంబాల‌కు చేదు అనుభ‌వం మిగులుస్తోంది. దీంతో, చేేసేదేమీ లేక తల్లిదండ్రులు తమ పిల్లలతో సహా వెనుదిరిగి వెళుతున్నారు. భార‌త ప్రభుత్వం త‌క్ష‌ణ‌మే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి త‌మ‌ను ఆదుకోవాల‌ని ఎన్నారైలు కోరుతున్నారు. ఆ నిబంధనను వెంటనే సడలించాలని కోరుతున్నారు.