Begin typing your search above and press return to search.

తనకు ప్రజల మద్దతు లేదన్న కుమారస్వామి

By:  Tupaki Desk   |   28 May 2018 3:55 PM IST
తనకు ప్రజల మద్దతు లేదన్న కుమారస్వామి
X
‘ఆరున్నర కోట్ల మంది కన్నడ ప్రజల మద్దతుతో తాను ముఖ్యమంత్రిని కాలేదని.. కాంగ్రెస్ మద్దతుతోనే సీఎం అయ్యానని’... కర్ణాటక సీఎంగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి ఆదివారం అన్నారు. బెంగళూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ప్రజల మద్దతు లేదని అనడం వివాదాస్పదమైంది. ఈ విషయంపై స్పందించిన మాజీ ప్రధాని హెచ్.డీ దేవెగౌడ కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి ఓ శిశువు మాత్రమేనని .. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరని చెప్పారు.

దేవెగౌడ మాట్లాడుతూ.. కుమారస్వామి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తరువాత ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. ఒక పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో అన్ని నిర్ణయాలు ఒక్కరే తీసుకోవడం సాధ్యంకాదని తేల్చిచెప్పారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఇరు పార్టీల నేతలు కలిసి నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిదని ఆయన అన్నారు.

ఇక కొత్త ప్రభుత్వంపై మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప అసెంబ్లీలో మండిపడ్డారు. జేడీఎస్ తండ్రి - కొడుకుల పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. దీనిపై మాజీ ప్రధాని దేవెగౌడ కౌంటర్ ఇచ్చాడు. నీచ రాజకీయాలు చేయడంలో యడ్యూరప్ప ముందు వరుసలో ఉంటాడని బదులిచ్చాడు