Begin typing your search above and press return to search.

పాక్ పెద్దాయ‌న‌తో మోడీ కుడిభుజం ర‌హ‌స్య భేటీ!

By:  Tupaki Desk   |   2 Jan 2018 5:28 AM GMT
పాక్ పెద్దాయ‌న‌తో మోడీ కుడిభుజం ర‌హ‌స్య భేటీ!
X
భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య ఒక‌ ర‌కంగా ఉద్రిక్త వాతావ‌ర‌ణ నెల‌కొన్న నేప‌థ్యంలో ఓ ర‌హ‌స్య భేటీ వెలుగులోకి రావ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.గతవారం కుల్‌ భూషణ్ జాదవ్‌ తో కుటుంబసభ్యుల సమావేశం తర్వాత పాకిస్థాన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన జరిగిన రెండురోజులకు.. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ న‌మ్మిన‌బంటుగా ఉండే భారత భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఓ ర‌హ‌స్య స‌మావేశంలో పాల్గొన్నారు. అది కూడా పాక్ అధికారుల‌తో కావ‌డం విశేసం. అయితే ఈ విష‌యాన్నిపాక్ బ‌య‌ట‌పెట్ట‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం

జాద‌వ్‌ తో కుటుంబ‌స‌భ్యులు భేటీ అనంత‌రం భారత్, పాకిస్థాన్ దేశాల జాతీయ భద్రత సలహాదారులు థాయ్‌ లాండ్‌ లో రహస్యంగా సమావేశమైనట్లు పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 27న థాయ్‌ లాండ్‌ లో పాక్ భద్రత సలహాదారు లెఫ్ట్‌ నెంట్ జనరల్ నాజర్‌ ఖాన్ జంజువా - అజిత్‌ దోవల్ భేటీ జరిగినట్లు పాకిస్థాన్‌ కు చెందిన డాన్ పత్రిక వెల్లడించింది. `భారత్ - పాకిస్థాన్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం చాలా బాగా జరిగింది. ఈ భేటీ ఉపయోగకరం కూడా. దోవల్ చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు` అని పాక్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. అయితే ఈ భేటీపై భారత్ ఇంతవరకు పెదవి విప్పలేదు.

కాగా, కుల్‌ భూషణ్ జాదవ్ ఘటనకూ ఈ భేటీకి ఎలాంటి సంబంధం లేదని - ముందుగా నిర్ణయించుకున్న మేరకే సమావేశం జరిగిందని పాక్ అధికారులు చెబుతున్నారు. ఇరుదేశాల భద్రతా సలహాదారులు మూడోదేశంలో భేటీ కావడం ఇది మొదటిసారి కాదు. 2015 డిసెంబర్‌ లో భద్రతాసలహాదారులు - విదేశాంగశాఖ కార్యదర్శులు బ్యాంకాక్‌ లో సమావేశమయ్యారు. అయితే ఆనాటి సమావేశ వివరాలను ఇరుదేశాల ప్రభుత్వాలే బయటకు వెల్లడించాయి. కానీ, తాజా భేటీ వివరాలను మాత్రం భారత్ ఇంతవరకు ఎక్కడా విడుదల చేయలేదు.