Begin typing your search above and press return to search.

జీవీకే రెడ్డి కుమార్తెకు నోటీసులు

By:  Tupaki Desk   |   27 Dec 2017 10:42 AM
జీవీకే రెడ్డి కుమార్తెకు నోటీసులు
X
ఇవాళ తెలుగు దిన పత్రిక చూశారా? అందులో.. ఒక క‌థ‌నం సంచ‌ల‌నంగా మారింది. బ‌డా సంస్థ‌.. బ‌డా క‌బ్జా పేరుతో భారీ క‌థ‌నం అచ్చేశారు. ఈ క‌థ‌నం సారాంశాన్ని మూడు ముక్క‌ల్లో చెబితే.. హైద‌రాబాద్ లో ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్‌.. రిచెస్ట్ ప‌ర్స‌న్స్ లో ఒక‌రైన జీవీకే రెడ్డి కుమార్తె షాలిని భూపాల్ ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేశార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

హైద‌రాబాద్ శివారులోని శంక‌ర‌ప‌ల్లి మండ‌లం కొండ‌క‌ల్ గ్రామంలో దాదాపు రూ.200 కోట్ల విలువైన ప్ర‌భుత్వ ఆసైన్డ్ భూమితో పాటు.. బిలాదాఖ‌లా భూముల్ని సైతం ఆక్ర‌మించేశార‌న్న‌ది ఆరోప‌ణ‌.

స‌ర్వే నెంబ‌రు లేని కొల‌త‌కు రాని భూమిని ఆమెకు సంబంధించిన కంపెనీ ఒక‌టి అధీనంలో ఉంచుకుందంటూ క‌థ‌నం ప్ర‌చురించారు. ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లో మొద‌టిపేజీలో అంత ప్ర‌ముఖంగా క‌థ‌నం అచ్చేసిన త‌ర్వాత ప్ర‌భుత్వం రియాక్ట్ కాకుండా ఉంటుందా? అందులోకి కేసీఆర్ స‌ర్కారు హ‌యాంలో క‌బ్జాల్లాంటివి అస్స‌లు ఉండ‌వ‌ని చెప్పుకునే వేళ‌.. బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌థ‌నంపై తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు రియాక్ట్ అయ్యింది.

పొద్దున్న సీఎం పేషీ నుంచి వ‌చ్చిన ఆదేశాల నేప‌థ్యంలో ఈ క‌బ్జా వ్య‌వ‌హారంపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆగమేఘాల మీద రియాక్ట్ అయ్యింది. అసైన్డ్‌.. మాతృక భూముల్ని స‌ర్వే చేశారు. క‌థ‌నంలో పేర్కొన్న‌ట్లుగా ఈ భూములు అన్యాక్రాంత‌మైన‌ట్లుగా గుర్తించారు.

ప్ర‌భుత్వ భూముల్ని త‌మ అధీనంలో ఉంచుకున్న బ్లూస్ట్రీక్ ప్రైవేట్స్ లిమిటెడ్ కంపెనీ య‌జ‌మానికి నోటీసులు ఇచ్చారు. ఇంత‌కీ ఈ కంపెనీ య‌జ‌మాని ఎవ‌రంటారా? ఇంకెవ‌రు జీవీకే గ్రూపు అధినేత జీవీకే రెడ్డి కుమార్తె.. తాజ్ జీవీకే హోట‌ల్స్‌.. రిసార్ట్స్ లిమిటెడ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న శాలిని భూపాల్‌. ఈమె ఈ కంపెనీనే కాదు.. మ‌రొకన్ని కంపెనీల‌కు సైతం డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

కొండకల్‌లోని సర్వేనంబరు 388 - 381/1 - 381/2/1 - 381/2/2 - 381/3 - 381/4 - 381/5 - 389/1 - 389/2 - 389/3 - 389/4 - 389/5 - 389/6 - 393/1 - 393/2 - 393/3/1 - 393/3/2లోని మొత్తం 46.34 ఎకరాల అసైన్డ్‌ భూములకు బ్లూస్ట్రీక్‌ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగిపోయిన‌ట్లుగా గుర్తించారు. ఈ భూముల్ని అధీనంలో ఉంచుకోవ‌టంతో పాటు.. పేద‌ల‌కు ఇచ్చిన అసైన్డ్ భూముల‌ను కంపెనీ పేరు మీద బ‌దిలీ చేసుకోవ‌టం కూడా రూల్స్ కు విరుద్ధంగా తేల్చారు. ఈ భూముల్లో ఉన్న నిర్మాణాలు.. పంట‌ల్ని కూడా స్వాధీనం చేసుకోనున్న‌ట్లు చెప్పారు. భూమిని ప్ర‌భుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకూడ‌దో 15 రోజుల్లో చెప్పాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చేశారు.

ఇంత‌కీ.. శాలిని రెడ్డి పేరు ఎక్క‌డో విన్న‌ట్లుగా అనిపిస్తోందా? మీ సందేహం నిజ‌మే. జీవీకే రెడ్డి గారి కుమార్తెగా కొంద‌రికి మాత్ర‌మే పాపుల‌ర్ అయిన ఆమె.. అక్కినేని అఖిల్ తో పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వ‌చ్చి త‌ర్వాత క్యాన్సిల్ అయిన శ్రేయా భూపాల్ త‌ల్లిగా చాలామందికి సుప‌రిచితురాల‌య్యారు. ఫిఫ్టీ ప్ల‌స్ ఉన్న ఈ మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌రాలిపై వ‌చ్చిన క‌బ్జా ఆరోప‌ణ‌లు మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌టం ఒక ఎత్తు అయితే.. అవి నిజ‌మంటూ రెవెన్యూ అధికారులు తేల్చి నోటీసులు ఇవ్వ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మ‌రి.. దీనిపై షాలిని భూపాల్ వాద‌న బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.