Begin typing your search above and press return to search.

ఆకలి చావులతో బ్రతుకుతున్న ప్రజలు ఆ దేశంలో..!

By:  Tupaki Desk   |   4 Aug 2021 5:30 AM GMT
ఆకలి చావులతో బ్రతుకుతున్న ప్రజలు ఆ దేశంలో..!
X
ప్రపంచ నియంతగా గుర్తింపు పొందిన కిమ్ జోంగ్ ఏలుబడిలోని ఉత్తర కొరియా తీవ్ర ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటోంది. తిండి గింజలు లేక జనం ఆకలితో అల్లాడిపోతున్నారు. 1990నాటి తీవ్ర కరువు పరిస్థితుల తర్వాత మరోసారి ఇక్కడ అదే తరహా పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి. ఇదే పరిస్థితులు కొనసాగితే ఇక తాము బతికి బట్టకట్టడం కష్టమేనని ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర ఆహార ధాన్యాల కొరత తో దేశంలో లక్షలాది ఆకలి చావులు తథ్యంకావచ్చన్న ఆ దేశ అధికారిక గణాంకాలే చాటిచెబుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడం కిమ్ సర్కారుకు సవాలుగా మారింది.

ఆ దేశంలో గత మూడు దశాబ్ధాల కాలంలో మునుపెన్నడూ లేనిస్థాయిలో నెలకొంటున్న ఆహార సంక్షోభ పరిస్థితిని ప్రభుత్వ సంస్థ కొరియా డెవలప్‌మెంట్ ఇన్‌ స్టిట్యూట్ కూడా ధృవీకరిస్తోంది. సైన్యం దగ్గరున్న సరకులను ప్రజలకు పూర్తిగా పంచేసినా తీరని ఆహార సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది కిమ్ జోంగ్ ఉన్ సర్కార్. ఉత్తర కొరియా ప్రస్తుత జనాభా 26 మిలియన్లు. వీరికోసం దాదాపు 5.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. కానీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 1 మిలియన్ టన్నుల ధాన్యాలు మాత్రమే ఉన్నాయని మరో అధికారి కిమ్ యంగ్-కీ వివరించారు. మార్కెట్ ధరలను తగ్గించేందుకు సైన్యం కోసం నిల్వచేసిన ధాన్యాన్ని అక్కడి ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తోందని దక్షిణ కొరియాకు చెందిన నిపుణుడు నాన్-టే-జిన్ తెలిపారు.

యుద్ధం వస్తే సైన్యం అవసరాలు తీర్చేందుకు నిల్వ ఉంచిన ధాన్యాన్ని.. ప్రస్తుతం ఆహార ధాన్యాలు లేని వారికి, కూలీలు, గ్రామీణ ప్రజలకు అందిస్తున్నట్లు ఉత్తర కొరియాకు చెందిన జాతీయ ఇంటెలిజెన్స్ సర్వీస్ విభాగం అధికారి హా-టే-కీయంగ్ తెలిపారు. కరవుతో పోరాడటం.. దేశ అత్యయిక స్థితిని తెలియజేస్తోందన్నారు. ఈ సంక్షోభంపై ప్రజల్లో అవగాహన కల్పించటంపై దృష్టిసారించినట్లు తెలిపారు. ఆహార ధాన్యాల ధరలను సైతం ప్రభుత్వం తగ్గించే యత్నం చేస్తోందన్నారు. గత ఏడాది వేసవికాలంలో ఏర్పడిన తుపాను కారణంగా ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి.

దీంతో భారీగా పంట నష్టం జరగడంతో పాటు అక్కడ కొత్తగా పంట సాగుబడి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాగుకు అనువైన ప్రాంతాలపైనే తుపాను ఎక్కువ ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు కరోనా పాండమిక్ కారణంగా ఉత్తర కొరియా తమ దేశ సరిహద్దులను మూసేయడంతో పొరుగుదేశాల నుంచి వ్యవసాయ పనిముట్లు దిగుబడి చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ పనిముట్లు అందుబాటులో లేకపోవడం ఆ దేశ వ్యవసాయ రంగం పాలిట శాపంగా మారింది. పంట సాగుబడి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో అన్నదాతలు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంటోంది. దేశంలోకి కరోనా వైరస్ రాకూడదన్న ముందుచూపుతో కిమ్ విధించిన తీవ్రమైన ఆంక్షలు కూడా ఆ దేశ జనం పాలిట శాపంలా మారింది.

ఉత్తర కొరియాకు చైనాతో తప్ప మిగిలిన పొరుగు దేశాలతో సంబంధాలు అంతంత మాత్రమే. ఆ విషయానికి వస్తే మిగిలిన ప్రపంచ దేశాలతోనూ పెద్దగా ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు లేవు. సాయం చేస్తామన్నా మీ సాయం మాకొద్దులే అనే అహంకారపూరిత నైజం నియంత కిమ్‌ సొంతం. దేశ జనం ఆకలి బాధను తీర్చేందుకు సాయం చేయాలని ఇతర దేశాలను కోరేందుకు కిమ్‌‌కు నోరు రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటిపోక ముందే కిమ్ స్పందించాల్సిన అవసరం ఉంది. తనను నమ్ముకున్న జనం కోసం కిమ్ ఇతర దేశాల సాయాన్ని కోరుతారో, జనం ఆకలి బాధను చూసీచూడనట్లు ఉండిపోతారో, వేచి చూడాల్సిందే.