Begin typing your search above and press return to search.

ఇక లాభం లేదు జ‌పాన్‌ ను అంతం చేయాల్సిందే!

By:  Tupaki Desk   |   14 Sep 2017 9:40 AM GMT
ఇక లాభం లేదు జ‌పాన్‌ ను అంతం చేయాల్సిందే!
X
ఇటీవ‌లి కాలంలో మూర్ఖ‌పు దూకుడుకు మారుపేరుగా మారిపోయిన ఉత్త‌ర కొరియా మ‌రోసారి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసింది. ఇన్నాళ్లూ అగ్ర‌రాజ్యం అమెరికాను బెదిరించిన ఆ దేశం.. తాజాగా జ‌పాన్‌ పై ప‌డింది. అణు బాంబుతో జ‌పాన్‌ ను మొత్తం స‌ముద్రంలో క‌లిపేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ తాజా బెదిరింపుల‌తో ఉత్త‌ర ఆసియాలో మ‌రిన్ని ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొనే ప్ర‌మాదం క‌నిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

గ‌త నెల‌లోనే జ‌పాన్ మీదుగా ఓ బాలిస్టిక్ మిస్సైల్‌ ను ఉత్త‌ర కొరియా ఫైర్ చేసిన విష‌యం తెలిసిందే. అమెరికా - ద‌క్షిణ కొరియా మిలిట‌రీ క‌స‌ర‌త్తుల‌కు నిర‌స‌న‌గా త‌మ సామ‌ర్థ్యం ఏంటో తెలియ‌జెప్పాల‌న్న ఉద్దేశంతోనే ఈ మిస్సైల్‌ ను ఫైర్ చేసిన‌ట్లు ఉత్త‌ర కొరియా చెప్పుకుంది. ఈ మిస్సైల్‌ ను ఫైర్ చేసిన త‌ర్వాత కూడా జ‌పాన్ దారికి రాలేదంటే.. అంత‌క‌న్నా పెద్ద దాడి జ‌ర‌గాల్సిందే అని ఉత్త‌ర కొరియా అధికార వ‌ర్క‌ర్స్ పార్టీ అధికార ప్ర‌తినిధి చెప్ప‌డం గ‌మ‌నార్హం. నాలుగు ద్వీపాల‌ స‌మూహ‌మైన ఆ దేశంపై అణు బాంబు వేసి దానిని స‌ముద్రంలో క‌లిపేయాల్సిందే అని ఉత్త‌ర కొరియా అధికార మీడియా గురువారం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మా ప‌క్క‌న ఉండే హ‌క్కు ఇక జ‌పాన్‌ కు లేదు అని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇది తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సిన విష‌య‌మ‌ని, ఇంత దారుణంగా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు స‌రి కాద‌ని జ‌పాన్ ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి యోషిహిడె సుగా అన్నారు. కాగా, ఈ తాజా హెచ్చ‌రిక‌ల‌పై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.

కాగా, జపాన్ ప్రధాని షింజో అబే భార‌త‌దేశంలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్‌ ట్రైన్ ప్రాజెక్టుకు మోడీ-అబే సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. 500 పైచిలుకు కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లో చేరుకునే ఈ రైల్వే ప్రాజెక్టుకు జపాన్ తక్కువవడ్డీకి రుణం సమకూరుస్తోంది. 2022 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు. అనంతరం గాంధీనగర్‌ లో జరిగే 12వ ఇండో-జపాన్ వార్షిక సదస్సులో ఉభయనేతలు పాల్గొంటారు. తదుపరి వాణిజ్య ప్లీనరీ సమావేశం జరుగుతుంది. గుజరాత్‌ లో పెట్టుబడులకు సంబంధించిన 12 ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని స‌మాచారం.