Begin typing your search above and press return to search.

ఇవాంకా ట్రంప్ సెక్యూరిటీకి టాయిలెట్ సౌకర్యం లేదట!

By:  Tupaki Desk   |   17 Jan 2021 9:15 AM GMT
ఇవాంకా ట్రంప్ సెక్యూరిటీకి టాయిలెట్ సౌకర్యం లేదట!
X
రక్షణ రగంలోకి అమెరికా ఖర్చుచేస్తున్నంత మొత్తం.. ఇప్పటి వరకూ మరే దేశమూ ఖర్చు పెట్టట్లేదు. ప్రజాప్రతినిధుల భద్రత విషయంలోనూ అమెరికన్ సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉంటుందో తెలిసిందే. అయితే.. అక్కడి సీక్రెట్ సర్వీసు ఏజెంట్లకు టాయిలెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారట! నమ్మడానికి కష్టంగా ఉన్నా.. ఇదే వాస్తవం.

అమెరికాలోని వాషింగ్టన్ ఎలైట్ కలోరమా అనే విలాసవంతమైన భవనంలో మాజీ అమెరికా అధ్యక్షుల నుంచి కేబినెట్ సెక్రటరీల వరకూ నివాసముంటూ ఉంటారు. వీరి రక్షణ బాధ్యతను యూఎస్ సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు చూస్తుంటారు. అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ భద్రతాచర్యలు చేపడుతుంటారు. అలాంటి వారిని టాయిలెట్ కష్టాలు వెంటాడుతుండడం గమనార్హం.

ప్రస్తుతం ఈ భవనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ నివాసం ఉంటున్నారు. వీరికి రక్షణ ఉండే యూఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది టాయిలెట్ వసతి లేక ఇబ్బందులు పడుతున్నారట! ఈ భవనంలో సెక్యూరిటీకి టాయిలెట్ సౌకర్యం కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.

మొత్తం ఆరు బెడ్ రూంలు, ఏడు బాత్ రూంలతోపాటు 5వేల చదరపు అడుగల విస్తీర్ణంలో ఉండే విలాసవంతమైన భవనంలో సెక్యూరిటీ సిబ్బందికి అవసరమైన టాయిలెట్ వసతి కల్పించకపోవడం గమనార్హం. సిబ్బందికి నివాసం కూడా సరిగా లేదట. అంతేకాదు ఈ భవనంలోకి వెళ్లేందుకు కూడా వీరికి అనుమతి ఉండదట.

దీంతో.. సెక్యూరిటీ సిబ్బంది టాయిలెట్ సౌకర్యం కోసం సమీపంలో ఒక భవనాన్ని రెంటుకు తీసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వం ప్రతినెలా 3వేల డాలర్లు ఖర్చు చేస్తోంది. అంటే.. మన కరెన్సీలో దాదాపు రూ.2.20లక్షలు.

సీక్రెట్ సర్వీసు సిబ్బందికి టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం టాయిలెట్ కోసం అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు అక్కడివారు. అంత పెద్ద భవనంలో సీక్రెట్ ఏజెంట్ల నివాసానికి చోటు కల్పించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఇది సీక్రెట్ సర్వీస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. ట్రంప్ కుటుంబం అభ్యర్థన మేరకు ఏజెంట్లను దూరంగా ఉంచినట్టు చెప్పుకొచ్చారు.