Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్ ప్రమాదం లేదు ..స్కూళ్లు ఓపెన్ చేయండి : తెలంగాణలో రీఓపెన్‌ ఎప్పుడంటే ?

By:  Tupaki Desk   |   12 Aug 2021 1:09 PM IST
థర్డ్ వేవ్ ప్రమాదం లేదు ..స్కూళ్లు ఓపెన్ చేయండి : తెలంగాణలో రీఓపెన్‌ ఎప్పుడంటే ?
X
కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ తదితర పరిస్థితులు విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపాయి. దీని వల్ల పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. రెండో వేవ్‌ కు ముందు స్కూళ్లు తెరిచినప్పటికీ కేసులు పెరిగిపోవడంతో మూసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా, మళ్లీ స్కూళ్లు తెరవాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. అయితే, మళ్లీ కోవిడ్ మూడో వేవ్ హెచ్చరికలు ఉన్నందున ఈ సమయంలో పాఠశాలలు తెరవడం సాధ్యమా అనే సందేహం తలెత్తుతోంది.

దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను దశలవారీ పద్ధతిలో ఇప్పటికే పునఃప్రారంభించారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తెలంగాణలో కూడా స్కూళ్లు తెరవడంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 1న జరిగిన మంత్రి మండలి సమావేశానికి ముందు రోజు తాము నివేదికను సమర్పించామని, కానీ ఆ విషయం కేబినెట్‌ లో చర్చించలేదని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 15 తర్వాత స్కూళ్లను దశల వారీగా మొదలుపెట్టాలని తాము సూచించినట్లు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో.. స్కూళ్లను రోజు విడిచి రోజు కరోనా నిబంధనలతో ఓపెన్‌ చేసేలా ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. దీనికి తగ్గట్లుగా కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో స్కూళ్లు తెరవడం లేదు. అయితే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరచుకుంటే ఇక్కడ కూడా స్కూళ్లు తెరవాలని ఒత్తిడి వస్తుంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిపుణులు భావిస్తున్నారు.

ఏపీలో ఈనెల 16 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నారు. తమిళనాడులో సెప్టెంబరు 1 నుంచి మొదలు పెట్టనున్నారు. అక్కడ 9 నుంచి 12 తరగతులను 50 శాతం విద్యార్థులతో నేరుగా క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక.. కర్ణాటకలో 9 నుంచి 12 తరగతులకు ఈ నెల 23 నుంచి ఆఫ్‌ లైన్‌ క్లాసులు మొదలుపెట్టనున్నారు. ఇక్కడ విద్యార్థులను రెండు గ్రూపులుగా వేరు చేసి రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌ లో ఈ నెల 16 నుంచి సగం మంది విద్యార్థులతో 11వ తరగతిపైబడిన విద్యాసంస్థలు తెరవనున్నారు.

ఒడిశాలో జులై 26 నుంచి ఈ తరగతులనే ప్రారంభించనున్నారు. కేసులు అధికంగా ఉండే మహారాష్ట్రలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈనెల 17 నుంచి తరగతులు నిర్వహించాలని ఉద్ధవ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు అయితే, ఈ నెల 15వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించడంతో పాఠశాలలు తెరవడమే మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 9, 10వ తరగతులకు ప్రత్యక్షంగా పాఠాలు చెప్పి, మిగతా క్లాసులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని అంటున్నారు. మరికొంతమంది తగిన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరవాలంటున్నారు.