Begin typing your search above and press return to search.

మరికొద్ది రోజుల్లో కాబూల్ కు విమానాలు వెళ్లలేవా?

By:  Tupaki Desk   |   23 Aug 2021 1:15 AM GMT
మరికొద్ది రోజుల్లో కాబూల్ కు విమానాలు వెళ్లలేవా?
X
అవును.. కాబూల్ విమానాశ్రయానికి రానున్నకొద్దిరోజుల్లో విమానాలు వెళ్లే సాహసం కూడా చేయవా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. వేలాది మంది అఫ్గాన్లు తమ ఆస్తుల్ని.. సంపదను వదిలేసి కట్టుబట్టలతో దేశం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నారు. బతికి ఉంటే చాలు.. ఏదోలా బతికేయొచ్చు అన్నట్లుగా వారితీరు ఉంది. దీంతో.. పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టులకు పోటెత్తుతున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఎయిర్ పోర్టుకు వెళ్లే వారిని నియంత్రించేందుకు తాలిబన్లు పెద్దఎత్తున చర్యలు చేపడుతన్నారు. వారిని అడ్డుకుంటున్నారు.

ఇక.. కాబూల్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న తాజా తొక్కిసలాటలో ఏడుగురు మరణించటం తెలిసిందే. జనాల్ని నియంత్రించేందుు తాలిబన్లు చెలరేగిపోతూ.. విపరీతంగా కొట్టేస్తున్నారు. గాల్లో కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికే భయాందోళనలో ఉన్న అఫ్గాన్లకు కాబూల్ ఎయిర్ పోర్టు వద్డ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చేలా మారిపోతున్నాయి. దీనికి తోడు.. ఎయిర్ పోర్టు రన్ వే మీద.. చెత్త అంతకంతకూ ఎక్కువైపోతోంది. వేలాది మంది ప్రజలు ఎయిర్ పోర్టుకు రావటం.. పరిశుభ్రత పాటించకుండా ఉండటం.. ఆహారం.. వాటర్ క్యాన్లు వదిలేయటంతో గడిచిన వారంలో పెద్ద ఎత్తు చెత్త రన్ వే మీద దర్శనమిస్తోంది.

దీంతో. . విమానాల్ని నడపటం కష్టంగా మారినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తమ విమాన సర్వీసుల్నికాబూల్ కు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో వివిధ నగరాలకు నడిపినా.. మారిన పరిస్థితుల్లో కాబూల్ కే పరిమితం చేసింది. తాజాగా.. కాబూల్ కు కూడా తన విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లుగా పేర్కొంది. కాబూల్ విమానాశ్రయంలో తగినన్ని సదుపాయాలు లేకపోవటం.. రన్ వే మీద చెత్త అంతకంతకూ పేరుకుపోవటం.. వాటిని శుభ్రం చేసే సిబ్బంది విధులకు రాకపోవటంతో.. విమానాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ కారణాన్ని చూపించి పాక్ తన విమాన రాకపోకల్ని నిలిపివేసింది.

ఇప్పుడున్న పరిస్థితులు మరింత దిగజారిన పక్షంలో.. మిగిలిన దేశాల విమానాలు రానున్న రోజుల్లో రావటం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సేఫ్ ల్యాండింగ్ కు అవసరమైన పరిస్థితులు ఉండాలని.. వాటి మీద ఎవరూ ఫోకస్ పెట్టకపోవటం వల్ల.. విమనాలు రాలేని పరిస్థితికి రానున్న రోజుల్లో ఉంటుందంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా కాబూల్ విమానాశ్రయంలోని విమానాలపై ఐసిస్ ఉగ్రవాదులు క్షిపణులతో దాడి చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

అమెరికాతో సహా మిగిలిన దేశాలు తమ విమానాలు ల్యాండింగ్ వేళ కొత్త జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెట్టాయి. గతానికి భిన్నంగా ఆదివారం నుంచి విమానాల ల్యాండింగ్.. టేకాఫ్ వేళ యుద్ధ తంత్రాల్ని అనుసరిస్తున్నాయి. నిప్పులు విరజిమ్ముతూ ఒక్కసారిగా నిటారుగా కిందకు దూసుకొస్తూ ల్యాండింగ్ చేస్తున్నారు. దీంతో.. తమపై విరుచుకుపడే క్షిఫణుల్నితప్పు దారి పట్టించే వీలుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న అనుమానాలు నిజాలై.. ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులుషురూ చేస్తే.. మిగిలిన ప్రపంచంతో కాబూల్ సంబంధాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.